ఏపీలో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల కేటాయింపుపై సస్పెన్స్ వీడింది. గురువారం ( జూన్ 4 ) జరిగిన సమావేశంలో కూటమి నేతల మధ్య అవగాహన కుదిరింది. టీడీపీకి 3, జనసేనకు ఒక స్థానం కేటాయించాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఎం క్యాంపు ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు.
సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, SIR, రాజైసభ స్థానాలపై చర్చించారు. రాజ్యసభ అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్యరామిరెడ్డి, పరిమళ నత్వానీతో పాటు ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రాజ్యసభకు వెళ్లిన సానా సతీష్ పదవీకాలం త్వరలో ముగుస్తుంది.
శాసనసభలో మెజారిటీ స్థానాలు ఉన్న క్రమంలో ఈ నాలుగు సాహనాలు కూటమికే దక్కనున్నాయి.ఈ క్రమంలో టీడీపీ, జనసేన నాలుగు రాజ్యసభ స్థానాలు పంచుకున్నాయి.
11 రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల:
త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ:
- మధ్యప్రదేశ్: తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్.
- రాజస్థాన్: అల్కా గుర్జార్, సతీష్ పూనియా.
- ఒడిశా: దేబాశిష్ సమంత రే.
- గుజరాత్: రాజుభాయ్ శుక్లా, మాన్సింగ్, ముకేష్ భాయ్ రత్నా, జితేంద్ర.
- మణిపూర్: శారదా దేవి.
- అరుణాచల్ ప్రదేశ్: తాయి తాగాక్.
