శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ముర్మకు అధికారులు ఘన స్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ముర్ముకు అధికారులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ విమనాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై, మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ముర్ము 5 రోజులు బస చేయనున్నారు. 

హైదరాబాద్ నుంచి ముర్ము శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు. 12 గంటలకు శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. స్వామి వారికి పంచమూర్త అభిషేకం నిర్వహిస్తారు. భ్రమరాంభ ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాదం ప్రాజెక్టు స్కీం ద్వారా దేవస్థానం నిర్మించిన యాత్రిక భవనం, ఓపెన్ ఆడిటోరియాన్ని ప్రారంభించనున్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. చెంచు ట్రైబల్స్ తో సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం హెలికాప్టర్ లో హకీంపేట్ ఎయిర్ బేస్ కు చేరుకుంటారు. 

రాష్ట్రపతి పర్యటనకు ఆంధ్రప్రదేశ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట హెలిప్యాడ్ దగ్గర ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశాయి. రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పలుమార్లు ట్రయిల్ రన్ కూడా నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపీ చెక్ పోస్ట్ లింగాలగట్టు శిఖరం పాయింట్ దగ్గర, తెలంగాణ చెక్ పోస్ట్ దోమలపెంట దగ్గర మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా భక్తులకు ఇవాళ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలు నిలిపివేశారు. 

శ్రీశైల మల్లన్న దర్శనం తర్వాత హెలికాప్టర్ లో 4.15 కు హకీంపేట్ ఎయిర్ బేస్ కు రానున్నారు. అక్కడ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత నేరుగా బొల్లారం రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.