V6 కథనానికి స్పందన..వరద బాధితులను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్

V6 కథనానికి స్పందన..వరద బాధితులను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్

పెద్దపల్లి జిల్లా మంథని గౌతమేశ్వర ఆలయం వద్ద వరదల్లో చిక్కుకున్న 23మందిని ఎన్డీఆర్ఎఫ్ రక్షించింది. ఆలయం చుట్టూ భారీగా వరద నీరు చేరడంతో గుడి దగ్గరున్న 23 మంది వరదల్లో చిక్కుకున్నారు. చిక్కుకున్న వారిలో పూజారుల కుటుంబ సభ్యులు సహా చేపల వేటగాళ్లు ఉన్నారు. దీనిపై V6 ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం 23మందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఈ నేపథ్యంలో V6 కు వరద బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

కాగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతా కాదు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నడుము లోతు నీరు ఇండ్లలోకి వచ్చేయడంతో బయటపడేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మర్రివాడకు వరద ఉధృతి పెరగడంతో అక్కడి నుంచి బయట పడేందుకు ఓ కుటుంబం చాలా కష్టపడింది. బాహుబలి సినిమా తరహాలో మూడు నెలల బాలుడిని బుట్టలో పెట్టి.. ఆ బుట్టను తలపై ఉంచుకొని వరద నీటిని  దాటారు. కొన్ని చోట్ల వరద నీరు భుజాల వరకు వచ్చినా.. ఒక కుటుంబంలోని వారంతా..  ఒకరికి ఒకరు తోడుగా.. సురక్షితంగా బయటపడ్డారు. ఇళ్ల మిద్దెలపై ఉన్న కొందరు వరద నీటి బీభత్సాన్ని ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేయడంతో అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.