నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో వైద్యం వికటించి నిండు గర్భిణి చనిపోయింది. బంధువుల వివరాల ప్రకారం.. దుగ్గొండి మండలం మధిరకు చెందిన లావణ్య(24)కు నెక్కొండ మండలం ముదిగొండకు చెందిన రాకేశ్రెడ్డికి ఏడాదిన్నర క్రితం పెండ్లయ్యింది. ప్రస్తుతం లావణ్య నిండు గర్భిణి. శనివారం పురిటి నొప్పులు రావడంతో ఆమె అత్త రేణుక నర్సంపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లింది. నొప్పులు రావడం సహజమేనని.. ఏమీ కాదని డాక్టర్ చెప్పారు. ఆదివారం ఉదయం మరోసారి నొప్పులు రావడంతో కాంపౌండర్ఒక ఇంజక్షన్చేశారు. కొన్ని నిమిషాల్లోనే లావణ్య చనిపోయింది. డాక్టర్ నిర్లక్ష్యం, వైద్యం వికటించడంతోనే తమ బిడ్డ మృతి చెందిందని లావణ్య కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్గేటు ముందు ఆందోళన చేశారు. చివరికి రూ.4లక్షల పరిహారం చెల్లిస్తామని హాస్పిటల్యాజమాన్యం చెప్పడంతో ఆందోళన విరమించారు. డెడ్బాడీని మధిరకు తరలించారు.