యువతిపై అత్యాచారం కేసు..సందీప్ లామిచానేను సస్పెండ్ చేసిన నేపాల్ క్రికెట్ బోర్డు

యువతిపై అత్యాచారం కేసు..సందీప్ లామిచానేను సస్పెండ్ చేసిన నేపాల్ క్రికెట్ బోర్డు

18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసిన కేసులో ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించిన నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచానేని ఆ దేశ క్రికెట్ సంఘం గురువారం (జనవరి 11) సస్పెండ్ చేసింది. ఖాట్మండు జిల్లా కోర్టు బుధవారం తీర్పును ప్రకటించగా.. ఈ పరిణామంపై  స్పందించిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (CAN) ఉదయం లామిచానేను సస్పెండ్ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 

సందీప్ లామిచ్చానే దోషిగా నిర్ధారించబడి శిక్ష విధించబడినందున అతను ఎలాంటి దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ ఆడకూడదని ఈ ప్రకటనలో తెలిపింది. యువతిపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచానేకు ఖాట్మండు జిల్లా కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించడమే కాక రూ. 300,000 జరిమానా విధించింది. వీటితోపాటు బాధితురాలికి రూ.200,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఆగస్ట్ 21, 2022న తిల్‌గంగాలోని ఒక హోటల్‌లో సందీప్ లామిచానే తనపై అత్యాచారానికి పాల్పడినట్లు గుషాలా(26) అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి.. ఇంటర్ పోల్ సాయంతో అరెస్టు చేశారు. అనంతరం అతను బెయిలుపై విడుదలయ్యాడు. ఈ కేసులో మొదట బాధితురాలు తాను మైనర్‌నని ఆరోపించినప్పటికీ.. న్యాయస్థానం మైనర్ కాదని తెలిపింది. గత డిసెంబరులో అతన్ని దోషిగా తేల్చిన ఖాట్మండు డిస్ట్రిక్‌ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.  

ఖాట్మండు జిల్లా ప్రభుత్వ న్యాయవాది కార్యాలయం ప్రకటన ప్రకారం.. 2017 జాతీయ శిక్షాస్మృతి చట్టం సెక్షన్ 219లోని సబ్-సెక్షన్ 3 (డి) ప్రకారం లామిచానే అత్యాచారానికి పాల్పడినట్లు తేలడంతో అతనికి 8 సంవత్సరాల జైలు శిక్ష విధించబడినట్లు తెలిపింది. ఇప్పటికే  లామిచానే పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ చేయబడినట్లు వెల్లడించింది. లామిచానే నేపాల్ తరపున 103 మ్యాచ్‌లలో 210 వికెట్లు పడగొట్టాడు. 2018-20 మధ్యకాలంలో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 9 మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.