
- రాష్ట్ర అధికారులను అభినందించిన నేపాల్ మేయర్లు, చైర్ పర్సన్లు
హైదరాబాద్, వెలుగు: జవహర్ నగర్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ నిర్వహణ బాగుందని నేపాల్ ప్రతినిధులు ప్రశంసించారు. ఆ దేశంలోని వివిధ జిల్లాలకు చెందిన మున్సిపల్ మేయర్లు, చైర్పర్సన్లు, అధికారుల బృందం 10 రోజుల పర్యటనలో భాగంగా మన దేశంలోని ఉత్తమ పాలనా విధానాలను అధ్యయనం చేయడానికి వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(ఎన్ఐఆర్డీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐయూఎం) సంయుక్తంగా వారికి శిక్షణ ఇస్తున్నాయి.
ఈ మేరకు జవహర్నగర్లోని మున్సిపల్ సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను మంగళవారం వారు సందర్శించారు. అక్కడ అమలవుతున్న ఆధునిక ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను చూసి వారు ప్రశంసలు కురిపించారు. అనంతరం అంబర్పేటలో ఉన్న 339 ఎంఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. ఇటువంటి సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు.