
- ఇరిగేషన్కు కొత్త చట్టం
- ఫారెస్ట్ యాక్ట్ తరహాలో చట్టం రూపకల్పనకు సర్కార్ కసరత్తు
- నాలుగు ఇరిగేషన్ యాక్ట్లు కలిపి కొత్తది తెచ్చే ఆలోచన
- నేషనల్ వాటర్ పాలసీకి అనుగుణంగా స్టేట్ వాటర్ పాలసీ తేవాలని నిర్ణయం
- ఈఎన్సీలు, సీఈలతో ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్కుమార్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: నీటి పారుదల శాఖ కోసం సమగ్ర చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఫారెస్ట్ యాక్ట్ తరహాలో పటిష్టంగా కొత్త చట్టాన్ని రూపొందించనుంది. దీనిపై మంగళవారం జలసౌధలో ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఈఎన్సీలు, సీఈలతో రివ్యూ చేశారు. ‘ఇంటిగ్రేషన్ ఇరిగేషన్ యాక్ట్ - 2022’పేరుతో దీనిని రూపొందిస్తున్నారు. ఈ చట్టంలో ఏయే అంశాలు పొందుపరచాలి, ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయి.. అనే దానిపై ఈఎన్సీలు, సీఈల అభిప్రాయాలు తీసుకున్నారు. కొత్తగా తీసుకురానున్న చట్టంపై ‘కేపీఎంజీ’ఏజెన్సీ ప్రజంటేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4 ఇరిగేషన్ యాక్ట్లు అమల్లో ఉన్నాయని, వాటన్నింటిని కలిపి కొత్త యాక్ట్ తీసుకొస్తామని ఈఎన్సీలు వివరించారు. తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ - 1357, తెలంగాణ ఇరిగేషన్ (కన్స్ట్రక్షన్ అండ్ మెయింటనెన్స్ ఆఫ్ వాటర్ కోయర్సెస్) 1965, తెలంగాణ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ 1997, తెలంగాణ ఇరిగేషన్ యుటిలైజేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ యాక్ట్ 1984లో ఉన్న అంశాలను వివరించారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఇరిగేషన్ చట్టాలన్నీ నిజాం పాలనతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చినవేనని, కొత్త రాష్ట్రంలో మారిన ప్రయారిటీలకు అనుగుణంగా చట్టంలో మార్పులు చేయాల్సి ఉందని ఇంజినీర్లు వివరించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డ్యాం సేఫ్టీ యాక్ట్తో పాటు నేషనల్ వాటర్ పాలసీకి అనుగుణంగా స్టేట్ వాటర్ పాలసీ రూపొందించించాలని సమావేశంలో నిర్ణయించారు. భూములు, ఆస్తులు అన్యాక్రాంతమైతే వాటిని నిరోధించడానికి ఐపీసీ సెక్షన్లు, నీటి తీరువా లేదు కాబట్టి ఇతర మార్గాల్లో డిపార్ట్మెంట్కు సమకూరే ఆదాయం, వాటర్ మేనేజ్మెంట్, యూనిఫాం నామిక్లేచర్ (డిపార్ట్మెంట్లో వినియోగించే పదాలన్నీ ఒకే రూపంలో ఉండేలా చూసుకోవడం), ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ తదితర అంశాలను కొత్త చట్టంలో పొందుపరచనున్నారు. గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్కు సంబంధించిన అంశం చట్టంలో చేర్చాలా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇతర రాష్ట్రాల చట్టాలపై స్టడీ చేయండి..
గుజరాత్, జమ్మూకశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్లో అమలవుతున్న ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ యాక్ట్లపై అధ్యయనం చేయాలని రజత్ కుమార్ సూచించారు. ఆయా చట్టాల్లో ఏయే అంశాలు అడాప్ట్ చేసుకోవచ్చు, వాటి అమలులో ఉన్న లోపాలు, చేయాల్సిన మార్పులు, చేర్పులపై స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రౌండ్లో ఫీల్డ్ ఇంజినీర్లకు ఎదురయ్యే చాలెంజెస్, వాటికి ఎలాంటి పరిష్కారాలు కావాలి, చట్టంలో ఏయే అంశాలను చేర్చితే బాగుంటుంది అనే దానిపై త్వరలోనే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈఈలతో వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని అంశాలపై స్పష్టత వచ్చాక కొత్త చట్టం రూపొందించి సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపుతామని, ఆ తర్వాత కేబినెట్ అప్రూవల్ తీసుకొని అసెంబ్లీలో పెట్టిన తర్వాత చట్టం అమల్లోకి వస్తుందని అధికారులు వివరించారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, అనీల్ కుమార్, నాగేందర్రావు, శంకర్, సీఈలు పాల్గొన్నారు.