రోడ్డు ప్రమాదంలో నవదంపతుల మృతి

రోడ్డు ప్రమాదంలో నవదంపతుల మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవదంపతులు చనిపోయారు. యడవల్లి వెంకటేశ్ (30), మానస నవ్య (26)లకు ఈ నెల 14న వివాహమైంది. నాలుగు రోజుల తర్వాత నిన్న(గురువారం) మధ్యాహ్నం గుంటూరు జిల్లా గోవాడ నుంచి భార్య, ఆమె సోదరుడు భరత్‌తో కలిసి వెంకటేశ్ విశాఖ జిల్లా సబ్బవరానికి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోని పూళ్ల దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపునకు దూసుకెళ్లింది.

అదే సమయంలో ఏలూరు వైపు వెళ్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్, మానస నవ్య, భరత్, కారు డ్రైవర్ చంద్రశేఖర్ (64) తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్ చరణ్ స్థానికుల సాయంతో గాయపడిన వారిని తన వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేశ్, నవ్య, చంద్రశేఖర్ మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన భరత్ చికిత్స పొందుతున్నాడు. వివాహమై వారం రోజులు కూడా కాకముందే ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.