లాక్ డౌన్…కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

లాక్ డౌన్…కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

దేశంలో లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. లాక్‌ డౌన్‌ పూర్తయ్యే వరకు విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు రద్దు చేస్తున్నట్టు చెప్పింది. విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు, థియేటర్లు, మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, బార్లు మూసివేయనున్నట్టు తెలిపింది. మత ప్రార్థనలు,దైవ కార్యక్రమాలపై నిషేధం విధించింది. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది.  ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్ మెకానిక్స్, కార్పెంటర్ల సేవలకు అనుమతినిచ్చింది. వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి బోర్డర్స్ దాటేందుకు వ్యక్తులకు అనుమతి లేదని తెలిపింది.

అయితే ఏప్రిల్‌ 20 తర్వాత మాత్రం కొన్ని రంగాలకు కేంద్రం సడలింపులు ప్రకటించింది కేంద్రం. దేశవ్యాప్తంగా వ్యవసాయ సంబంధిత అన్ని కార్యక్రమాలను కొనసాగించవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌ షాపింగ్ ద్వారా నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతిచ్చింది. బ్యాంకుల కార్యకలాపాలు యథాతథంగా కొనసాగనున్నట్ట చెప్పింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణకు అనుమతి కల్పించింది.

వీటితో పాటు.. కాఫీ, తేయాకు తోటల్లో 50 శాతం మ్యాన్‌పవర్‌కు అనుమతి,రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు వ్యక్తులను అనుమతి నిరాకరణ, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి, వివాహాలకు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పని సరి, జాతీయ ఉపాధిహామీ పనులకు అనుమతి.విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు దుకాణాలకు పర్మిషన్, అనాథ, దివ్యాంగ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి,భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు,నిర్మాణ రంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులకు మాత్రమే అనుమతి, ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఫేస్‌ మాస్క్‌లను ధరించడం తప్పనిసరి, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధించనున్నట్లు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని కేంద్రం ప్రకటించింది.