
హైదరాబాద్, వెలుగు:కొత్త మున్సిపల్ యాక్ట్ బిల్లును ఆమోదించడం కోసం రెండు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 18, 19 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మండలి సెషన్ 19వ తేదీకే పరిమితం కానుంది. 18న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కొత్త మున్సిపల్ యాక్ట్ బిల్లును ప్రవేశపెడతారు. దానిపై అధ్యయనం చేయడానికి సభ్యులకు ఆ రోజు సమయం ఇచ్చి 19న చర్చించిన అనంతరం బిల్లును ఆమోదిస్తారు.
19న ఉదయం మండలిలో కేబినెట్ మంత్రుల్లో ఒకరు కొత్త మున్సిపల్ యాక్ట్ బిల్లును ప్రవేశపెడతారు. కొంత విరామం తర్వాత దానిపై చర్చించి మండలిలో బిల్లును పాస్ చేస్తారు. మున్సిపల్ యాక్ట్ బిల్లు ఆమోదం కోసమే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నదని, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఈ సెషన్లో ఉండబోవని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకే కొత్త మున్సిపల్ చట్టాన్ని ఉభయ సభల ఆమోదానికి తెస్తున్నారు. మున్సిపల్ డ్రాఫ్ట్ బిల్లు సిద్ధమయ్యిందని, మార్పుచేర్పులు, లీగల్ అంశాలపై అధ్యయనం కోసం న్యాయశాఖకు పంపామని సీఎంవో ఈ ప్రకటనలో వెల్లడించింది.
ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు రాష్ట్ర ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఫిబ్రవరి 25న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపగానే అసెంబ్లీ, మండలి వాయిదా పడ్డాయి. ఆ తర్వాత ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ ఇచ్చారు. మున్సిపల్ యాక్ట్ బిల్లు ఆమోదానికి ఉభయ సభలను సమావేశ పరిచేందుకు గవర్నర్ తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. శుక్ర, శనివారాల్లో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది.