- పదేండ్ల పాలనలో కనిపించిన జాగలన్నీ కబ్జా పెట్టారు: బండి సంజయ్
- కమీషన్లు దండుకుని కేంద్ర నిధులనూ మళ్లించారు
- ఎవరి పొట్ట కొట్టాలి? ఎట్ల పైసలు సంపాదించాలి? అన్న దానిపైనే
- బీఆర్ఎస్ నేతల ధ్యాస వాళ్లను మళ్లా గెలిపిస్తే ప్రజల ఇండ్లను కూడా కబ్జా పెడ్తరు
- కాంగ్రెస్ దొంగ హామీలతో జనాలను మోసం చేసిందని ఫైర్
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ అంటే భూరాక్షసుల సమితి అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ పార్టీ నేతలు పదేండ్ల పాలనలో కనిపించిన జాగలన్నీ కబ్జా చేసి దోచుకుతిన్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కరీంనగర్లోని కోతిరాంపూర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో సంజయ్ మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ అంటే భూరాక్షసుల సమితి. ఆ పార్టీ నేతలు పదేండ్ల పాలనలో కరీంనగర్తో పాటు చుట్టుపక్కల కనిపించిన భూములన్నీ కబ్జా చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి పేదల భూములు స్వాహా చేశారు. భూకబ్జాలు చేసి ప్రజలను అరిగోస పెట్టిన 46 మంది బీఆర్ఎస్ నాయకులను నేనే జైలుకు పంపిన” అని సంజయ్ చెప్పారు. కమీషన్లు దండుకుని కేంద్ర నిధులను కూడా మళ్లించారని ఆరోపించారు. ‘‘పొరపాటున మళ్లీ బీఆర్ఎస్కు ఓటు వేశారో.. మీ ఇంట్ల పడి దోచుకుంటరు.
మీ పుస్తెలతాళ్లు కూడా తీస్కపోతరు. మీరు నిలబడి ఉన్న రెండడుగుల జాగ కూడా వాళ్లదే అంటరు. వాళ్లను ఇంకా నమ్ముకుంటే.. మీ ఇల్లును కూడా అమ్ముకుంటరు. వాళ్లకు పైసలు కావాలి.. మాకు ప్రగతి కావాలి. వాళ్లకు మీ భూమి కావాలి.. మాకు మీ బాగోగులు కావాలి.. వాళ్లకు అవినీతి పనులు కావాలి.. మాకు ఆదర్శమైన పాలన కావాలి. అందుకే ఆలోచించండి.. బీజేపీకి అవకాశం ఇవ్వండి” అని ప్రజలను కోరారు. ‘‘భూరాక్షసుల సమితికి రెండే లక్ష్యాలు. ఎవరి పొట్ట కొట్టాలి, ఎట్ల పైసలు సంపాదించాలి.. అనేదే వాళ్ల టార్గెట్. ఓట్లప్పుడు మీకు దండాలు పెడతారు. తర్వాత మీ జీవితాలతో ఆడుకుంటారు. ఈ భూరాక్షసుల మీద పోలీస్ స్టేషన్లలో 2,600కు పైగా ఫిర్యాదులు అందాయంటే.. వీళ్ల అరాచకాలు ఏ విధంగా సాగాయో ఆలోచించండి. మందిని ముంచడంలో, కుట్రలు చేయడంలో బీఆర్ఎస్ నేతలు డబుల్ డిగ్రీలు, పీహెచ్డీలు చేశారు” అని ఫైర్ అయ్యారు.
