సోషల్ మీడియా కొత్త రూల్స్ నేటినుంచి అమల్లోకి..

సోషల్ మీడియా కొత్త రూల్స్ నేటినుంచి అమల్లోకి..
  • ఫేస్ బుక్, ట్విట్టర్ బ్లాక్ అవుతయా?
  • నేటి నుంచి కొత్త ఐటీ రూల్స్ పాటించని సంస్థలపై వేటేనా?

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సంస్థలు దేశంలో బ్యాన్ అవుతాయా? బుధవారం నుంచి అందుబాటులో ఉండవా? రూల్స్​ పేరుతో ఈ కంపెనీలపై  కత్తి వేలాడుతోందా?.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు. ఈ నెల 26 నుంచి దేశంలో కొత్త ఐటీ రూల్స్ అమల్లోకి వస్తుండటం, వీటిని పాటించేందుకు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఇచ్చిన 3 నెలల గడువు మంగళవారం ముగియడమే ఇందుకు కారణం. దీంతో ఆ రూల్స్ ను పాటించని సంస్థలను దేశంలో బ్లాక్ చేసే అవకాశం ఉంది.

కొత్త రూల్స్ అమల్లోకి
దేశంలో సోషల్‌ మీడియా కట్టడికి ఫిబ్రవరి 25న ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ తెచ్చింది. మే 26 నుంచి అమల్లోకి తీసుకొస్తామంది. రూల్స్ పాటించేందుకు 3 నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు మంగళవారంతో ముగిసింది. ఈ రూల్స్​కు ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ సంస్థలు ఇంకా అంగీకరించలేదు. ప్రభుత్వం జారీ చేసిన రూల్స్​కు అనుగుణంగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నట్లు మాత్రమే ఫేస్ బుక్ తెలిపింది. మే 25 లోగా వారు కొత్త రూల్స్ ను పాటించకపోతే, అవి తమ హోదాను కోల్పోతాయి. ఇండియా చట్టాల ప్రకారం వాటిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని ఓ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ రూల్స్ కు అంగీకారం తెలిపే అంశంపై.. అమెరికాకు చెందిన ఆయా సంస్థలు ఆరు నెలల సమయం కోరాయి. కానీ కేంద్ర అందుకు ఒప్పుకోలేదు.

కొత్త ఐటీ రూల్స్ ఇవీ..
ప్రతి సోషల్ మీడియా కంపెనీకి ఇండియాలో సంబంధిత అధికారులు ఉండాలి. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకర కంటెంట్ తొలగింపు చేపట్టాలి. ఈ రూల్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూ వర్తిస్తాయి. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇతర సంస్థలు గ్రీవియన్స్ రెడ్రెసల్ ఆఫీసర్ ను నియమించాలి. ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు వాటిపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలి.