
భూమిలో జీవానికి, భూమిపై మానవాళికి పెనుముప్పుగా మారింది గడ్డి మందు. ఈ గడ్డి మందును పూర్తిగా నిషేధించని వ్యవస్థలు, దీని వాడకంపై పరిమితిని విధించాయి. కానీ, కొన్నిచోట్ల నిషేధం ఉన్నా, పరిమితులు ఉన్నా యథేచ్ఛగా గడ్డిమందు క్రయ విక్రయాలు, వాడకాలు జరుగుతున్నాయి. భూమి పుడమిలో జీవాన్ని హరించేది కలుపు కాదు, కలుపును చంపుతున్న గ్లైఫోసేట్ అనే నాన్- సెలెక్టివ్ హెర్బిసైడ్. ఇది వాడిన భూమిలో జీవం మిగలదు. ఇది ఉన్న చోట మట్టి శ్వాస తీసుకోలేదు. పంటల మీద పడితే మాడిపోతాయి. అది వాడిన గడ్డిని తినే మూగజీవాలు మృత్యువాత చెందుతాయి. రైతులు, ప్రజలు తీవ్రమైన అనారోగ్యం బారిన పడతారు.
గ్లైఫోసేట్ అంటే ఏమిటి ?
గ్లైఫోసేట్ అనేది ఒక బ్రాడ్-స్పెక్ట్రం కలుపు నివారణ మందు. దీన్ని అమెరికాలోని ఒక ప్రముఖ కంపెనీ మొదటిసారిగా 1970లో ‘రౌండప్’ అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. ఇది మొక్కలలోని ముఖ్యమైన ఎంజైమ్ను నిరోధించి మొక్కల పెరుగుదల నిలిపేస్తుంది. దీన్ని ప్రధానంగా కలుపు మొక్కల కోసం వాడతారు. అయితే, ఇది పంట మొక్కలు, మట్టి జీవులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రైతులు కూలీల ఖర్చు తగ్గించేందుకు గ్లైఫోసేట్ను విస్తృతంగా వాడుతున్నారు. దీని వలన వారు కలుపును చంపుతున్నట్టు కనిపించినా, భవిష్యత్తులో అనారోగ్య ఖర్చులు, భూమి నష్టాలు, దిగుబడి తగ్గుదల వంటివి మరింత నష్టం తెస్తున్నాయి. 2023లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధ్యయన ప్రకారం గ్లైఫోసేట్ పిచికారి చేయడం కారణంగా నెలకు సగటున 12 మంది రైతులు తీవ్రంగా అనారోగ్యానికి గురవుతున్నారు.
పర్యావరణ ప్రభావం– భూతాపానికి మూలం
గ్లైఫోసేట్ వల్ల మట్టిలోని ఫంగై, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నశించి, హ్యూమస్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఇది కార్బన్ నిల్వల తగ్గుదలకు దారితీసి, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని పెంచుతుంది. దీని వలన వాతావరణ మార్పులకు ఇది పరోక్షంగా కారణమవుతుంది. భారతదేశంలో గ్లైఫోసేట్ అనధికారికంగా తీవ్రంగా ప్రమాదకరమైన రసాయనంగా గుర్తించినా, ఇప్పటికీ ఇది గ్రామీణ ప్రాంతాల్లో స్వేచ్ఛగా లభిస్తోంది. 2022 నవంబరులో కేంద్ర ప్రభుత్వం పాక్షిక నిషేధాన్ని ప్రకటించినా, అది కేవలం నామమాత్రమే. తెలుగు రాష్ట్రాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో అప్పట్లో 60 రోజుల తాత్కాలిక నిషేధం విధించినా మార్కెట్లలో బహిరంగంగా గ్లైఫోసేట్ లభిస్తోంది.
రాష్ట్రాలకు శాశ్వత నిషేధానికి అధికారం లేకపోవడమే దానికి ప్రధాన కారణం. కేరళ, సిక్కిం లాంటి రాష్ట్రాలు మాత్రం రాజకీయ సంకల్పంతో శాశ్వత నిషేధం అమలు చేయగలిగాయి. కాగా, గ్లైఫోసేట్ మానవ ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. WHO కి చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ పర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ 2015లో గ్లైఫోసేట్ను "ప్రాబబుల్ హ్యూమన్ కార్సిజెన్ (గ్రూప్ 2ఏ)"గా ప్రకటించింది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. విషపదార్థాన్ని తక్కువ ఖర్చు, తక్కువ శ్రమ అంటూ విక్రయించడమంటే రైతుల జీవితాలను చీకట్లో నెట్టివేయడమే. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, పరిశోధన సంస్థలు రైతుల అభివృద్ధికి మార్గం చూపించాల్సిన బాధ్యతను వదిలి కార్పొరేట్ కంపెనీల ఒత్తిడితో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
పరిష్కార మార్గాలు
గ్లైఫోసేట్పై ప్రభుత్వాలు శాశ్వత నిషేధం విధించాలి. జీవ, సేంద్రీయ కలుపు నివారణ పద్ధతుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. సేంద్రీయ విత్తనాలు, జీవ ఉత్పత్తుల అందుబాటు పెంచాలి. విపత్తులను నివారించే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గ్లైఫోసేట్పై అవగాహన ప్రచారాలు గ్రామస్థాయిలో నిర్వహించాలి. రైతు శ్వాస బతికుండాలంటే, మట్టిలో జీవం కొనసాగాలంటే, భవిష్యత్ పంటల భద్రత కోసం గ్లైఫోసేట్కు శాశ్వతంగా ముగింపు పలకాలి. ఒక రైతు కాదు, మట్టి కాదు, ఒక తరం కాదు, దేశ భవిష్యత్తే ప్రమాదంలో ఉంది. దీన్ని మౌనంగా చూస్తే మనం కూడా జీవిత వ్యతిరేక శక్తుల సహకారులమే అవుతాం. ఇప్పటికైనా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలకులు, శాస్త్రవేత్తలు కలసి జీవరక్షణ యజ్ఞం ప్రారంభించాలి. జీవవైవిధ్యం కాపాడాలి. జీవవిధ్వంసక రసాయనాలను నిషేధించాలి.
జి. అజయ్ కుమార్, వ్యవసాయ నిపుణుడు