హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2023–24 అకడమిక్ ఇయర్ నుంచి డిగ్రీ బీఏ, బీకాం కోర్సుల్లో కొత్త కరికులమ్ స్టార్ట్ చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. అప్పటిలోపు బ్రిటీష్ కౌన్సిల్తో పాటు భాగస్వామ్య యూనివర్సిటీల సహకారంతో కొత్త పాఠ్యప్రణాళిక తెస్తామని స్పష్టం చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రపంచస్థాయి నైపుణ్యాలు అందించి, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా డిగ్రీ పాఠాలను రూపొందించాలని నిర్ణయించామన్నారు. డిగ్రీలో కొత్త కరికులమ్ రూపకల్పనకు బ్రిటీష్ కౌన్సిల్, టీఎస్ సర్కారు మధ్య 2018లో ఒప్పందం కుదిరిందని, ఆ తర్వాత 2020లో యూకేకు చెందిన రెండు యూనివర్సిటీలతో రాష్ట్రంలోని ఓయూ, కేయూలతో ఎంవోయూ జరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిలో కరికులమ్ డెవలప్మెంట్పై బ్రిటీష్ కౌన్సిల్ దక్షిణాది డైరెక్టర్ జానకీ పుష్పనాథ్, కౌన్సిల్ వైస్ చైర్మన్ వెంకటరమణ, ఓయూ, కేయూ వీసీలు రవీందర్, రమేశ్ తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోధన ప్రణాళికను రూపొందించే ప్రయత్నంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి పురోగతి సాధిస్తోందని జానకీ పుష్పనాథ్ అన్నారు.
