
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. దీంతో ఆయనను సాక్షిగా పరిగణించాలంటూ ఢిల్లీ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటిదాకా ముగ్గురు అరెస్టు అయ్యారు. ఇక సీబీఐ వేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ ఇవాళ విచారణ జరిపే అవకాశం ఉంది. మరో నిందితుడు సమీర్ మహేంద్రు.. అరోరా నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్ బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ విధానంలో భాగంగా నగరాన్ని 32 జోన్లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ, కాంగ్రెస్లు వ్యతిరేకిస్తూ ఎల్జీకి ఫిర్యాదు చేశాయి. అంతేకాకుండా, మద్యం విక్రయదారుల నుంచి దాదాపు రూ.144 కోట్ల బకాయిలను మాఫీ చేయాలన్న ఎక్సైజ్ శాఖ నిర్ణయాన్ని కూడా గవర్నర్ వీకే సక్సేనా తప్పుబట్టారు.