యూపీఐ రూల్స్​ మారినయ్​.. నేటి నుంచే కొత్తవి అమలు

యూపీఐ రూల్స్​ మారినయ్​.. నేటి నుంచే కొత్తవి అమలు

న్యూఢిల్లీ : మనదేశంలో డిజిటల్​ పేమెంట్స్​లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌ఫేస్ (యూపీఐ)   నిత్యజీవితంలో భాగంగా మారింది. అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల.. ఇలా దేనికైనా యూపీఐ యాప్స్​తో​ డబ్బులు కడుతున్నారు. ఇది ప్రారంభమైనప్పటి నుంచి రోజూ కోట్లలో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. యూపీఐ చెల్లింపులను మరింత మెరుగ్గా చేయడానికి ప్రభుత్వం కొన్ని మార్పులూ చేర్పూలు చేసింది. అవేంటో చూద్దాం.

వాడకుంటే బంద్​

ఏడాది కాలంగా వాడకంలో లేని గూగుల్​ పే, పేటీఎం, ఫోన్​ పే వంటి యూపీఐ ఐడీలను తొలగిస్తామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) ప్రకటించింది. ఇలాంటి ఖాతాల వల్ల మోసాలు జరగకుండా ఆపడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కావాలనుకుంటే వీటిని తిరిగి యాక్టివేట్​ చేసుకోవచ్చు.

పెరిగిన లావాదేవీ పరిమితులు:

యూపీఐ లావాదేవీల కోసం చేసే గరిష్ట రోజువారీ చెల్లింపు పరిమితిని రూ.లక్షకు ఎన్​పీసీఐ పెంచింది. అయితే, విద్య,  ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కోసం యూపీఐ లావాదేవీల పరిమితిని డిసెంబర్ 8న ఆర్​బీఐ రూ.5 లక్షలకు పెంచింది. ఇంతకు ముందు లావాదేవీ పరిమితి రూ. లక్షగా ఉండేది.

ఇంటర్ ​చేంజ్ ​ ఫీజు:

ఈ మార్పును 2023 ప్రారంభంలో ప్రకటించారు. ఆన్‌‌‌‌లైన్ వాలెట్ల వంటి ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్లకు 1.1 శాతం ఇంటర్‌‌‌‌చేంజ్ ఫీజు వర్తిస్తుంది. కొన్ని మర్చంట్లకు మాత్రమే ఇలాంటి చార్జీలు పడతాయి. లావాదేవీలు చేసేటప్పుడు ఇతర అదనపు ఖర్చులు ఏవీ ఉండవు.

నాలుగు గంటల లిమిట్​:

పెరుగుతున్న ఆన్‌‌‌‌లైన్ చెల్లింపు మోసాల కేసులను తగ్గించడానికి లిమిట్​ ఉండొచ్చు. ఇంతకు ముందు లావాదేవీలు చేయని వినియోగదారుల మధ్య రూ. 2,000 కంటే ఎక్కువ విలువ గల మొదటి చెల్లింపు కోసం నాలుగు గంటల కాల పరిమితి ఉంటుందని భావిస్తున్నారు.  త్వరలో యూపీఐ వినియోగదారులు ‘ట్యాప్ అండ్ పే’ ఫీచర్‌‌‌‌ని యాక్టివేట్ చేయగలుగుతారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొబైల్​ ఫోన్లో నియర్​ ఫీల్డ్​ కమ్యూనికేషన్​ చిప్​(ఎన్​ఎఫ్​సీ) ఉంటేనే ఈ ఫీచర్​ను వాడొచ్చు.

యూపీఐ ఏటీఎం

ఆర్​బీఐ దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ప్రవేశ పెట్టనుంది. ఈ ఏటీఎంలతో, మీరు మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా నగదు తీసుకోవడానికి క్యూఆర్​ కోడ్‌‌‌‌ని స్కాన్ చేయవచ్చు. ఇందుకోసం ఆర్​బీఐ జపాన్​కు చెందిన హిటాచీతో ఒప్పందం కుదుర్చుకుంది. మరో విషయం ఏంటంటే ఇకపై యూపీఐ యాప్​ల నుంచి ఎవరికి డబ్బు పంపినా, వారి బ్యాంకు ఖాతాలో ఉండే పూర్తి పేరు స్క్రీన్​పై కనిపిస్తుంది.

పెరిగిన లావాదేవీలు

కిందటి నెలలో రూ. 18.23 లక్షల కోట్ల విలువైన 12.02 వందల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి.  నవంబర్​తో పోలిస్తే వీటి విలువ ఐదు శాతం పెరిగింది. గత ఏడాది మొత్తం రూ.183 లక్షల కోట్ల విలువైన 117 వందల కోట్ల ట్రాన్సాక్షన్స్​ జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ట్రాన్సాక్షన్ల విలువ 59 శాతం పెరిగింది.