
ఎన్హెచ్ఏ వెహికల్
ఢీకొని ముగ్గురి మృతి
ఫుల్లుగా తాగి ఓవర్స్పీడ్ డ్రైవింగ్
ఢీకొట్టి పారిపోతుంటే
పట్టుకున్న యువకులు
పోలీసులకు డ్రైవర్ అప్పగింత
నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏ) వెహికల్ ఢీకొని ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. తాగిన మత్తులో డ్రైవర్ వేగంగా వచ్చి మెయిన్ రోడ్డు పక్కన జాగాలో పశువులు మేపుతూ రోడ్డుపై నిలబడ్డ వీరిని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన శేఖర్రెడ్డి ఎన్హెచ్ఏలో డ్రైవర్. ఇతను తన ఇన్నోవాను కాంట్ట్రాక్ట్ కింద ఎన్హెచ్ఏలో ఎంగేజ్కి ఇచ్చారు. వెహికల్ను తనే నడుపుతుంటడు. ఆదివారం ఫ్రెండ్స్లో కలిసి ఫుల్లుగా మందుతాగాడు. అనంతరం అక్కడి నుంచి రాజాపూర్ బయల్దేరాడు. కుచ్చర్కల్ గ్రామ సమీపంలో ఎడ్లు మేపుతూ రోడ్డు పక్కన నిల్చున్న అదే గ్రామానికి చెందిన రంగయ్య(56), యాదగిరి (16) , చంద్రయ్య(55)ను ఢీకొట్టాడు. వారు ముగ్గురు ఎగిరి పడి అక్కడిక్కడే మృతిచెందారు. అయినా పట్టించుకోకుండా పారిపోతుండగా.. ఇది గమనించి అక్కడి యువకులు వెహికల్ను వెంబడించారు. రంగారెడ్డిగూడ వద్ద అడ్డగించి శేఖర్రెడ్డిని రాజాపూర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు తెలిపారు.