
- మెరిసిన ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు
- బుధవారం వెలువడే ఫెడ్ పాలసీపై అందరి దృష్టి
- 25,350 వరకు నిఫ్టీ వెళ్లొచ్చంటున్న ఎనలిస్టులు
ముంబై: ఇజ్రాయెల్–-ఇరాన్ మధ్య గొడవలు కొనసాగుతున్నా, ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం వాటిని పట్టించుకోకుండా సోమవారం ర్యాలీ చేసింది. బెంచ్మార్క్ ఇండెక్స్లు సుమారు ఒక శాతం లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. ఆసియా మార్కెట్లు పాజిటివ్గా కదలడం కలిసొచ్చింది. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర కూడా సోమవారం 0.81 శాతం తగ్గి బ్యారెల్కు 73.63 డాలర్లకు దిగొచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 677.55 పాయింట్లు (0.84 శాతం) పెరిగి 81,796.15 వద్ద సెటిల్ అయింది. ఇంట్రాడేలో 747.22 పాయింట్లు (0.92 శాతం) ఎగసి 81,865.82 వరకు వెళ్లింది. సెన్సెక్స్లోని 30 షేర్లలో 27 గ్రీన్లో, 3 రెడ్లో క్లోజ్ అయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 227.90 పాయింట్లు (0.92 శాతం) లాభపడి 24,946.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కంపెనీల్లో అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్గా నిలిచింది. ఈ కంపెనీ షేర్లు సోమవారం 2.39 శాతం లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు కూడా పాజిటివ్గా క్లోజయ్యాయి. మరోవైపు టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి.
ఫెడ్ రేట్ల కోత?.. ఐటీ షేర్లు జూమ్
“ఇజ్రాయెల్-–ఇరాన్ టెన్షన్స్ ఉన్నా, లార్జ్-క్యాప్ షేర్ల సపోర్ట్తో మార్కెట్ పెరిగింది. ఇన్వెస్టర్లు వోలటాలిటీ ఉన్నా, లాంగ్-టర్మ్ ఫండమెంటల్స్ మీద ఫోకస్ పెట్టారు. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ తగ్గిన సంకేతాల కోసం అందరూ చూస్తున్నారు” అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ సెక్టార్లు బాగా రాణించాయని, యూఎస్ ఫెడ్ పాలసీ మీటింగ్ (జూన్ 17–-18)లో రేట్ల కోతపై ఒక క్లారిటీ రావొచ్చని అన్నారు. రేట్ల కోత ఉంటుందనే అంచనాలపై ఐటీ షేర్లు పెరుగుతున్నాయన్నారు.
బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ సోమవారం 0.93 శాతం, స్మాల్క్యాప్ 0.38 శాతం పెరిగాయి. అన్ని బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్లు పాజిటివ్లో ముగిశాయి. ఐటీ (1.50 శాతం), ఆయిల్ అండ్ గ్యాస్ (1.22 శాతం), రియల్టీ (1.21శాతం), సర్వీసెస్ (1.10 శాతం), కన్జూమర్ డ్యూరబుల్స్ (1.05 శాతం) లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో కొరియా (కోస్పీ), జపాన్ (నిక్కీ), చైనా (షాంఘై), హాంకాంగ్ (హాంగ్ సెంగ్) మార్కెట్లు గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. యూరోప్, యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) లు సోమవారం నికరంగా రూ. 2,287 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
రానున్న సెషన్లలో మార్కెట్..
ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ డే మాట్లాడుతూ, ‘‘నిఫ్టీకి 21-ఈఎంఏ(21 రోజుల మూవింగ్ యావరేజ్) వద్ద సపోర్ట్ లభించింది. ఈ లెవెల్ కిందకి వెళ్లిన తర్వాత మళ్లీ దాన్ని క్రాస్ చేసింది. ఒక్కసారిగా బాగా పెరిగింది. నిఫ్టీ శుక్రవారం సెషన్లో కూడా ఇంట్రాడే కనిష్టాల నుంచి పెరిగింది. అవర్లీ చార్ట్లో ఓవర్సోల్డ్ జోన్లో నిఫ్టీ ఉంది. ఇన్వెస్టర్లు యూఎస్ ఫెడ్ రేట్ ప్రకటన తర్వాత వచ్చే కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి పెద్దగా డైరెక్షనల్ మూవ్ ఇప్పట్లో ఆశించడం లేదు. అయితే, నిఫ్టీ 25,000 మార్క్ని మళ్లీ టచ్ చేస్తే, 25,350 వరకు ర్యాలీ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కిందకి వస్తే, 24,850 వద్ద సపోర్ట్ ఉంది”అని వివరించారు.
‘‘మార్కెట్ మార్నింగ్ సెషన్లో కొంచెం తగ్గినా, బలంగా రికవర్ అయ్యింది. నిఫ్టీ రోజంతా లాభాలు పెంచుకుంటూ సుమారు ఒక శాతం ర్యాలీ చేసింది. చివరికి 227.90 పాయింట్ల లాభంతో 24,946.50 వద్ద క్లోజ్ అయింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్లు గ్రీన్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, రియల్టీ సెక్టార్లు ఎక్కువగా పెరిగాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు కూడా మార్నింగ్ నష్టాల నుంచి రికవర్ అయ్యి, చివర్లో దాదాపు ఒక శాతం లాభపడ్డాయి. టెక్నికల్గా చూస్తే, నిఫ్టీ డైలీ చార్ట్లో బుల్లిష్ క్యాండిల్ను ఏర్పాటు చేసింది. ఈ ట్రెండ్ కొనసాగితే, నిఫ్టీ తన ప్రస్తుత సైడ్వేస్ రేంజ్ని పైకి బ్రేక్ చేసే అవకాశం ఉంది. 25,200 వద్దకు రెసిస్టెన్స్, 24,840 లెవెల్కు సపోర్ట్ మారుతుంది”అని ప్రోగ్రెసివ్ షేర్స్ డైరెక్టర్ ఆదిత్య గగ్గర్ అంచనా వేశారు.