ఐటీ కారిడార్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేశారు. మహిళల భద్రతలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఐటీ కంపెనీల్లోని కొందరు మహిళలు ఆఫీస్ క్యాబ్లను ఉపయోగించుకోవడం లేదన్నారు. స్నేహితులను కలిసేందుకు, డిన్నర్, పార్టీలకు వెళ్లడం వంటి మొదలైన వాటికి కార్యాలయాల నుంచే నేరుగా వెళ్లిపోతున్నారన్నారు.
కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. కొన్ని సందర్భాల్లో ఫోన్లో సైతం అందుబాటులో ఉండడం లేదన్నారు. అటువంటి సమయంలో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. అదే విధంగా ఆ మహిళ మిస్ అయినట్లు కేసులు సైతం నమోదు చేయమని తల్లిదండ్రలు పోలీసులను కోరుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం కంపెనీల యాజమాన్యాలు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలు తెలుసుకునేలా ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు.
ఇందుకోసం జీవో జారీ చేశామన్నారు. కార్మిక శాఖ ఉపాధి శిక్షణ, కర్మాగారాలు (లేబర్ డిపార్ట్మెంట్) శాఖ జీవో నెంబర్.51 తేదీ, 16.06.2016 ప్రకారం రాత్రి 8.30 తర్వాత పని చేసే మహిళలకు వారు పని చేస్తున్న సంస్థ తప్పనిసరిగా రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ విషయం వారికి తెలిసేలా రవాణా సౌకర్యాలపై తప్పనిసరిగా ఆఫీసు ప్రధాన ద్వారం వద్ద తెలుగు, ఇంగ్లీష్ లో నోటీసు అతికించాలన్నారు. ఇవి పాటించని ఐటీ కంపెనీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసు శాఖ జారీ చేసిన సర్క్యులర్ లో నిబంధనలివీ..
అన్ని కంపెనీలు కార్మికుల ఉపాధి శిక్షణ, కర్మాగారాలు (లేబర్ డిపార్ట్మెంట్) యొక్క జీవో నెంబర్.51,
తేదీ16-.06-.2016 ప్రకారం మహిళా ఉద్యోగులకు సంస్థ రవాణా సౌకర్యాలను అందించాలి.
ఆఫీసు ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యాలను ఉపయోగించకుండా ఆఫీసు సమయం తర్వాత ఆఫీసు నుంచి బయటికి వెళ్లినప్పుడు ఆ మహిళా ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులు లేదా సహచరులకు సమాచారం అందించాలి.
మహిళా ఉద్యోగులు ఏదైనా ఒక రోజు రవాణా సౌకర్యాన్ని ఉపయోగించకపోతే, వారు ఆ రోజు ఎక్కడ ఉంటున్నారనేది వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లయితే, డిక్లరేషన్ లో సంతకం చేయాలి.
ఏదైనా ఇబ్బందికర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ 100 లేదా సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ 9490617444 కు సమాచారం చేరవేయాలి.