- 21 నెలల తర్వాత పతకం ఖాయం
గ్రేటర్ నోయిడా: సొంతగడ్డపై వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నీలో ఇండియా బాక్సర్లు పతక పంచ్లు కురిపిస్తున్నారు. తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్, జాస్మిన్ లంబోరియా, జాదుమణి సింగ్ తదితరులు ఫైనల్ బెర్తులు ఖరారు చేసుకున్నారు. గురువారం మొత్తంగా 15 మంది గోల్డ్ మెడల్ కోసం పోటీపడనున్నారు. డబుల్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ (51 కేజీ) 21 నెలల గ్యాప్ తర్వాత ఇంటర్నేషనల్ మెడల్ ఖాయం చేసుకుంది. నేరుగా సెమీఫైనల్లో బరిలోకి దిగిన నిఖత్ బుధవారం జరిగిన బౌట్లో 5–0తో ఉజ్బెకిస్తాన్కు చెందిన గనియేవా గుల్సేవర్పై విజయం సాధించింది.
భుజం గాయం కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉన్న జరీన్ తొలి రౌండ్లో లయ అందుకోవడానికి కాస్త ఇబ్బంది పడినా తన అనుభవంతో విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాతి రెండు రౌండ్లలో వ్యూహాత్మకంగా ఆడి తనదైన లెఫ్ట్ హుక్స్తో పైచేయి సాధించింది. ఫైనల్లో ఆమె చైనీస్ తైపీకి చెందిన గువో యి జువాన్తో తలపడనుంది. 57 కేజీ సెమీస్లో వరల్డ్ చాంప్ జాస్మిన్ 5–0తో ఉల్జాన్ సర్సెన్బెక్ (కజకిస్తాన్)ను చిత్తు చేసింది.
మెన్స్లో జాదుమణి సింగ్ (50 కేజీ) 5–0తో ఆస్ట్రేలియా బాక్సర్ ఒమర్ ఇజాజ్పై గ్రాండ్ విక్టరీ సాధించాడు. పవన్ బర్త్వాల్ (55 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీ), హితేష్ గులియా (70 కేజీ) కూడా ఫైనల్కు దూసుకెళ్లగా... నీరజ్ ఫొగాట్ (65 కేజీ), జుగ్నూ (85 కేజీ), సుమిత్ (75 కేజీ) సెమీస్లో ఓడారు.
