
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిరసనకు దిగిన నిమ్జ్ భూ నిర్వాసితులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పరిహారం ఇవ్వకుండా, తమ సమస్యలు పరిష్కరించకుండా భూములు లాక్కున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ జహీరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. నిమ్జ్ లో తొలి పరిశ్రమ వెమ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ర్యాలీగా వచ్చిన భూ నిర్వాసితులను అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులతో భూ నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు. అదుపుచేసే క్రమంలో భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.