
హైదరాబాద్, వెలుగు: బనచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తరలించుకుపోయేలా ఏపీకి తెలంగాణ సర్కార్ సహకరిస్తున్నదని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఒప్పందంగా చిత్రీకరించడం రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
కృష్ణాలో తెలంగాణ ఇప్పటికే నష్టపోయిందన్నారు. ఏపీలో కేవలం తెలుగు గంగకే నీటి కేటాయింపులున్నాయని, కానీ, ఆ రాష్ట్రం మాత్రం 300 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించుకుందని మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశానికి పిలిచి.. అధికారుల ముందు రాజకీయాలు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని, నిజంగా ఉరి తీయాల్సి వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉరి తీయాలని ఫైర్ అయ్యారు.