
హైదరాబాద్, వెలుగు : ‘రుర్బన్’ డ్రైల్యాండ్ పంటలు, స్మార్ట్ ఫార్మింగ్ ను ప్రోత్సహించడంలో సహకరించుకునేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్), ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ- ఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్)అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. సోమవారం ఇక్రిశాట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, వాల్యూ చైన్ డెవలప్మెంట్ ద్వారా ఇక్రిసాట్పంటల కోసం 'రుర్బన్' క్లస్టర్లను అభివృద్ధి చేయడం, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ తో అనుసంధానం ద్వారా గ్రామీణ ఇంక్యుబేషన్, ఎంటర్ ప్రెన్యూర్షిప్ వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకుంటాయి.
ఈ సందర్భంగా ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ అవకాశాలు, డ్రై ల్యాండ్ ఏరియాల నుంచి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు సాధ్యమవుతున్న నేపథ్యంలో రెండు సంస్థల మధ్య సహకారం అవసరమన్నారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూస్ మాట్లాడుతూ.. ఆఫ్రికా కోసం రెండు సంస్థలు కలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆర్ఎస్ గవలి, డాక్టర్ ఎం శ్రీకాంత్, డాక్టర్ కె కృష్ణా రెడ్డి, ఎన్ఐఆర్డీపీఆర్ డాక్టర్ కతిరేసన్, డాక్టర్ సీన్ మేయెస్, డాక్టర్ విక్టర్ అఫారి-సెఫా, డాక్టర్ ఎమ్ ఎల్ జాట్ , డాక్టర్ హరి కిషన్ సుదిని తదితరులు పాల్గొన్నారు.