నిర్మల్ లో వరదల నివారణకు పటిష్ట చర్యలు : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ లో వరదల నివారణకు పటిష్ట చర్యలు : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలో భవిష్యత్​లో వరదలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. లేక్ ప్రొటెక్షన్​పై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల భారీ వర్షాల కారణంగా పలు కాలనీల్లో వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.

 వరదల నియంత్రణలో సర్వే, రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. పట్టణంలో వరదలు సంభవించడానికి గల ప్రధాన కారణాలను గుర్తించి, వాటి నివారణకు శాశ్వత పరిష్కారాలు చూపాలన్నారు. వరద నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ఆర్.సుదర్శన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్లు రాజు, సంతోష్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.