
- పదేండ్లలో ‘ట్రిలియన్’ఎకానమీ సాధ్యమే!
- 2047 రైజింగ్ తెలంగాణ విజన్.. 3 ట్రిలియన్ ఎకానమీ రోడ్ మ్యాప్పై సంతృప్తి
- ట్రిపుల్ ఆర్, మెట్రో, మూసీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ, ఇన్వెస్ట్ మెంట్లు ప్లాన్ ప్రకారం జరగాలి
- అదే టైంలో రాష్ట్ర ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కం సమానంగా పెరగాల్సి ఉందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: వచ్చే పదేండ్లలో తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం సాధ్యమేనని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. తెలంగాణ 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.249 లక్షల కోట్లు) ఎకానమీగా రూపొందే దిశగా వేగంగా పయనిస్తోందని పేర్కొంది. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలను ప్రణాళిక ప్రకారం చేరుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, భారీ పెట్టుబడుల ఆకర్షణ వంటి ప్రాజెక్టులు ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనున్నాయని తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నీతి ఆయోగ్ కు ‘2047 తెలంగాణ రైజింగ్ విజన్’ రోడ్మ్యాప్ను సమర్పించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన నీతి ఆయోగ్, తెలంగాణ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అదే సమయంలో రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరగాలని సూచించింది. అధునాతన మౌలిక సదుపాయాలు, సరళీకృత విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆర్థిక విప్లవానికి బాటలు వేస్తాయని పేర్కొంది. ‘రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అంటే 2014-–15 నుంచి 2023-–24 మధ్యకాలంలో తెలంగాణ జీఎస్డీపీ ఏకంగా196% భారీ వృద్ధి నమోదు చేసింది. ఇది రానున్న కాలంలో మరింత పెరగనుంది. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల వాటానే దేశ జీడీపీలో ఏకంగా 30% ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో తెలంగాణ 5 శాతం మేర కంట్రిబ్యూట్ చేస్తోంది. రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు రాష్ట్ర నలుమూలలా తలసరి ఆదాయం సమానంగా పెరగాల్సి ఉంది’ అని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. నైపుణ్యాభివృద్ధికి టాస్క్ ఒక ఆదర్శవంతమైన నమూనా అని ప్రశంసించింది. అలాగే ఆరోగ్యం, విద్య వంటి సామాజిక రంగాలలో మూలధన వ్యయాన్ని పెంచాలనీ సూచించింది.
ఆర్థిక వృద్ధికి కీలక ప్రాజెక్టులివే..
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొన్ని కీలక ప్రాజెక్టులు జీవనాడిగా నిలవనున్నాయి. వన్ ట్రిలియన్ తోపాటు త్రీ ట్రిలియన్ ఎకానమీకి చేరాలంటే.. ఒక్కో ప్రాజెక్టు ఏ రకంగా రూపుదిద్దుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్లో ప్రస్తావించింది. అందులో ప్రధానంగా.. ‘‘ట్రిపుల్ ఆర్ వెంట కొత్త పారిశ్రామిక వాడలు, లాజిస్టిక్స్ హబ్లు ఏర్పాటై, భూముల విలువను పెంచుతాయి. నిర్మాణ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తాయి. అలాగే, మెట్రో విస్తరణ నగరంలో ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. మెట్రో మార్గాల్లో రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి, వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా సేవా రంగం వృద్ధికి తోడ్పడుతుంది. మూసీ అభివృద్ధి పర్యావరణపరంగానే కాకుండా, నదీ తీరంలో పార్కులు, వినోద కేంద్రాలు, వాణిజ్య సముదాయాల ఏర్పాటుతో ఆర్థికంగా, పర్యాటకంగా కూడా ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, స్మార్ట్ టెక్నాలజీలతో ప్రపంచ స్థాయి కంపెనీలను, టెక్నాలజీ స్టార్టప్లను ఆకర్షిస్తుంది” అని ప్రభుత్వం రోడ్ మ్యాప్లో వివరించింది. వీటన్నింటిని నీతి ఆయోగ్ ప్రశంసించింది. స్థిరమైన విధానాలు పెట్టుబడులను ఆకర్షించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని, ఈ విషయంలో తెలంగాణ ముందు స్థానంలో ఉందని వెల్లడించింది.
ఉపాధి, పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతోంది..
ఏ రాష్ట్రానికైనా భారీగా పెట్టుబడులు పెట్టే కంపెనీలు రావడంతో పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఇది తయారీ రంగాన్ని బలోపేతం చేసి, ఎగుమతులను పెంచుతుందని.. ఫార్మా, ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో తెలంగాణ ఇప్పటికే బలమైన స్థానాన్ని ఏర్పరుచుకుందని పేర్కొన్నది. ‘‘ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించబడటం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, ఆర్థిక చక్రం వేగవంతం అవుతుంది’’ అని తెలిపింది. ‘‘ఇప్పటికే ఏడాదిన్నరలో తెలంగాణ రూ.3.3 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించింది. లక్షల ఉద్యోగాలను సృష్టించింది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. హైదరాబాద్, దేశంలోనే రెండవ అతిపెద్ద ఐటీ ఎగుమతి కేంద్రంగా నిలిచింది. 25 బిలియన్డాలర్లకు పైగా ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. ఫార్మా రంగంలో, దేశంలోని మొత్తం ఔషధ ఉత్పత్తిలో 30% హైదరాబాద్ నుండే జరుగుతోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్కు విస్తరించాయని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఈ భారీ పెట్టుబడులు రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధికి దోహదపడుతాయి” అని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.