యాసంగి వడ్ల ​కు జాగ కరువు .. ఇందూర్​లో 157 రైస్ మిల్స్ ఫుల్

యాసంగి వడ్ల ​కు జాగ కరువు .. ఇందూర్​లో 157 రైస్ మిల్స్ ఫుల్
  • గోదాముల్లో ప్లేస్​ కోసం స్పీడ్​గా కస్టమ్ మిల్లింగ్​ ​ 
  • ఏఎంసీ, సింగిల్​ విండో గోదాం​లపై ఫోకస్​ 

నిజామాబాద్, వెలుగు : యాసంగి వడ్ల నిల్వకు గోదాముల కొరత ఏర్పడడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.  జిల్లాలో మొత్తం 252 రైస్​ మిల్లులుండగా, 26 మంది మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదు.  157 మిల్లులు వడ్లతో పూర్తిగా నిండిపోయాయి. 69 రైస్ మిల్స్​లో కూడా ధాన్యాన్ని నిల్వ చేయడానికి జాగా లేదు. 8 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించాలని పెట్టుకోగా, ఇప్పటి వరకు  6.63 లక్షల వడ్లు కొన్నారు. మరో లక్షన్నర టన్నుల వడ్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో వరి ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఎలాంటి సమస్య రాకుండా సివిల్​ సప్లయ్​ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.   

సర్కార్​ కాంటాల వైపే రైతుల మొగ్గు

యాసంగి సీజన్​కు సంబంధించి జిల్లాలో 4.19 లక్షల ఎకరాల్లో  వరి సాగు కాగా, అధికారులు 11.85 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 8 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్న జిల్లా యంత్రాంగం 600 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ  కాంటాలు ఏర్పాటు చేయక ముందు సుమారు 4 లక్షల టన్నుల పచ్చి వడ్లను ఎంఎస్​పీ కంటే తక్కువ రేట్​కు మిల్లర్లు కొనుగోలు చేశారు.  సర్కార్​ సన్న వడ్లకు మద్ధతు ధరతో పాటు రూ.500 బోనస్​ ప్రకటించడంతో రైతులంతా గవర్నమెంట్ కొనుగోలు సెంటర్లకే వస్తున్నారు.  రూ.254 కోట్ల విలువ కస్టమ్​ మిల్లింగ్​ వడ్లు ఫ్రాడ్ చేసిన 48 రైస్​ మిల్లర్లను బ్లాక్​ లిస్టులో పెట్టిన అధికారులు వారికి యాసంగి వడ్ల అలాట్​మెంట్ చేయలేదు.  

ఏప్రిల్​ 20 నాటికే 157 రా మిల్లులు వడ్లతో నిండిపోయాయి.  ప్రస్తుతం జిల్లాలో ఎవరేజ్​గా 44  డిగ్రీల ఎండ  నమోదై వడ్లు బాగా ఎండుతున్నాయి. వాటిని రా రైస్​ మిల్స్​లో మిల్లింగ్​ చేస్తే నూక శాతం ఎక్కువగా వస్తుంది. దీంతో తీసుకోవడానికి మిల్లర్లు  ముందుకురావడం లేదు. గత రెండు సీజన్లలో 1.46 లక్షల టన్నుల ఓల్డ్​ స్టాక్​ క్లియర్ చేయాల్సి ఉన్నందున 26 మంది రైస్​ మిల్లర్లు కొత్త స్టాక్​ వద్దని ఆఫీసర్లకు చెప్పేశారు. ఇక మిగిలిన 69 బాయిల్డ్​ రైస్​ మిల్లులకు తరలించిన వడ్లతో అక్కడా స్థలం 75 శాతం నిండింది. దీంతో మరో మూడు వారాలు కొనుగోలు చేసే లక్షన్నర టన్నుల ధాన్యాన్ని నిల్వ చేయడం కష్టంగా మారింది. 

రెండు రకాల ప్రయత్నాలు

సీజన్​ వడ్లు నిలువ చేసేందుకు స్థలం సమస్య రాకుండా సివిల్​ సప్లయ్ అధికారులు రైస్​ మిల్స్​ గోదాముల్లోని 1.46 లక్షల టన్నుల ఓల్డ్​ స్టాక్​ను రైస్​గా మార్చేందుకు ప్రయార్టీ ఇస్తున్నారు. ప్రతి రోజు గరిష్ఠంగా 5 వేల టన్నుల  బియ్యాన్ని అదిలాబాద్​, నిర్మల్, సంగారెడ్డి, మెదక్​, రంగారెడ్డి పంపుతున్నారు.  5 వేల టన్నుల కెపాసిటీ గల సింగిల్​ విండో గోదాంలు, మార్కెట్​ కమిటీ గోదాంలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రైవేట్​గోదాంలనూ పరిశీలిస్తున్నారు.

మూడు నెలల దృష్టితో ఏర్పాట్లు

కేవలం 69 బాయిల్డ్​ రైస్​ మిల్స్​లో మాత్రమే సీజన్​ వడ్లు స్టాక్​ పెట్టడానికి కొంత స్థలం ఉంది. వారం పది రోజుల్లో అవి కూడా ఫుల్​ అవుతాయి.  ఇబ్బంది రాకుండా సింగిల్​ విండో, మార్కెట్​ కమిటీ గోదాంలు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. బ్లాక్​ లిస్టులో ఉన్న 48 రైస్​ మిల్స్ గోదాంలు అనువుగా ఉంటే కలెక్టర్ పర్మిషన్​తో వాటిని తీసుకుంటాం. మూడు నెలల పాటు వడ్లు నిలువ పెట్టే ప్లాన్​తో వెళ్తున్నాం. ఇప్పటి వరకు 54,250 మంది రైతులకు రూ.1,084​ కోట్ల పేమెంట్స్ చేశాం. రెండు రోజుల్లో మరో రూ.260 కోట్ల చెల్లించనున్నాం.- శ్రీకాంత్​రెడ్డి, డీఎం, సివిల్​ సప్లయ్​