నిజామాబాద్ ఎంపీ టికెట్.. కవితకు డౌటే!

నిజామాబాద్ ఎంపీ టికెట్.. కవితకు డౌటే!
  •     బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని బీఆర్ఎస్ యోచన
  •     కవితకే టికెట్ ఇవ్వాలని స్థానిక నేతల డిమాండ్ 
  •     లోక్​సభ సన్నాహక సమావేశంలో స్పందించని అధిష్టానం 

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్​ఎంపీ టికెట్​డౌటేనని తెలుస్తోంది. ఆ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల నిర్వహించిన నిజామాబాద్​లోక్​సభ సన్నాహక సమావేశంలో స్థానిక నాయకులందరూ కవితకే టికెట్​ఇవ్వాలని డిమాండ్​చేశారు. 2019 ఎన్నికల్లో కవిత ఓటమి తర్వాత అందుకు దారితీసిన పరిస్థితులపై అధిష్టానం కనీసం సమీక్ష కూడా చేయలేదని ఆ సమావేశంలో నాయకులు మండిపడ్డారు. ఆ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్యేల వ్యవహార శైలితోనే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ​ఓడిపోయిందని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని కుండబద్దలు కొట్టారు. ఈ సమావేశం తర్వాతే కవితకు నిజామాబాద్​ఎంపీ టికెట్​దారులు మూసుకుపోయినట్టుగా పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతోంది. లోక్​సభ టికెట్​కవితకే ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు డిమాండ్​చేసినా.. పార్టీ అధిష్టానం​ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కరీంనగర్, చేవెళ్ల, ఖమ్మం లోక్​సభ అభ్యర్థులుగా వినోద్​కుమార్​, రంజిత్​రెడ్డి, నామా నాగేశ్వర్​రావుల పేర్లను ఆయా లోక్​సభ సన్నాహక సమావేశాల వేదికపై నుంచే ప్రకటించారు. రంజిత్ రెడ్డికి టికెట్​ఇవ్వాలని కోరుతూ సన్నాహక సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని నేతలు ప్రకటించారు. ఈ ముగ్గురు నేతల కన్నా నిజామాబాద్​ఎంపీ టికెట్​కవితకు ఇవ్వాలని ఎక్కువ మంది కోరారు. సమావేశానికి హాజరైన కార్యకర్తలు కొందరు రాతపూర్వకంగా కూడా ఇదే విషయం చెప్పారు. కానీ పార్టీ అధిష్టానం​మాత్రం ఆమెను లోక్​సభకు పోటీ చేయించే ఆలోచనలో లేనట్టుగా తెలుస్తోంది.