నిజామాబాద్ నగర పాలక సంస్థలో 59.12 శాతం పోలింగ్

నిజామాబాద్ నగర పాలక సంస్థలో 59.12 శాతం పోలింగ్

​నిజామాబాద్, వెలుగు :  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలోని 60 డివిజన్లలో బుధవారం పోలింగ్ ముగిసింది.  3,48,051 మంది ఓటర్లకుగాను 2,05,753 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్​ముగిసే సమయానికి 59.12 శాతం ఓటింగ్​నమోదైంది. 1,67,461 మంది పురుషుల్లో 98,469 మంది ఓటు వేయగా, 1,80,546  మహిళలకుగాను 1,07,282 మంది ఓటు వేశారు. ఇతరులు 44 మందిలో ఇద్దరు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం 7 గంటలకు పోలింగ్​ప్రారంభం కాగా,  సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.  5 గంటల్లోపు పోలింగ్​ సెంటర్​లోకి వచ్చిన వారికి టోకన్లు ఇచ్చి ఓటు వేసేందుకు అనుమతించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య పోలింగ్ సెంటర్లు విజిట్ చేసి ఓటింగ్ జరుగుతున్న తీరు పరిశీలించారు. పోలింగ్ ముగిశాక 729 పోలింగ్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్స్​లను పోలీస్​ బందోబస్త్​ మధ్య నగరంలోని గవర్నమెంట్​ పాలిటెక్నిక్​ కాలేజీ స్ట్రాంగ్​ రూమ్స్​కు తరలించారు.  రూమ్స్​కు సీల్​ వేసి సాయుధ పోలీస్​ బందోబస్త్ ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్​ రూమ్స్​ చుట్టూ భారీ వెలుతురు విరజిమ్మే లైట్లు ఏర్పాట్లు చేశారు. 

19వ డివిజన్​లో లాఠీ చార్జ్​

పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 19 వ డివిజన్​లో ఎలక్షన్​ కమిషన్​ రూల్స్​కు భిన్నంగా పోలింగ్ కేంద్రానికి దగ్గరలో ఉన్న కాంగ్రెస్​, బీజేపీ మద్దతుదారులను పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు. 28 డివిజన్​ కోసం ఖిల్లా స్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​లో ఓటింగ్ శాతం తక్కువ నమోదవుతుందని తెలిసి కాంగ్రెస్​, బీజేపీ నాయకులు అటు వెళ్లారు. హరిచరణ్​మార్వడీ స్కూల్​ల్లోని పోలింగ్ సెంటర్​లో తమ ఓటును వేరే వారు వేశారని  ఇద్దరు ముస్లిం మహిళలు వెనుదిరిగారు.  బోగస్​ ఓట్లు వేస్తున్నారని తెలిసి వచ్చిన ఎంపీ అర్వింద్​ పోలీసులను తీవ్ర స్వరంతో దూషించగా ఆయనపై కేసు నమోదైంది. 

పోలింగ్​ స్టాఫ్​ వాదన..

ఎలక్షన్​ నిర్వహించిన తమకు భోజన సదుపాయాలు నాసిరకంగా చేశారని పోలింగ్​ స్టాఫ్​ ఆరోపించారు. పోలింగ్​ తరువాత బ్యాలెట్​ బాక్స్​లు అప్పగించడానికి డిస్ట్రిబ్యూషన్​ సెంటర్​కు వచ్చాక రూ.800 చొప్పున పేమెంట్​ చేయడాన్ని వ్యతిరేకించారు. ఇతర జిల్లాల్లో రూ.1,300 చెల్లిస్తుండగా తమకు తక్కువ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విషయాన్ని పరిష్కరిస్తామని నగర పాలక కమిషనర్ దిలీప్​కుమార్ వారికి నచ్చజెప్పారు.