- రేప్ కేసులు పెట్టిస్తామని నగదు లూటీ
- భార్యాభర్తల గలీజ్ దందా
నిజామాబాద్, వెలుగు: చీకటి పడ్డాక పురుషులను ఆకర్షించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ కేసు పెట్టిస్తానని నిలువు దోపిడీ చేస్తున్న మహిళ, ఆమెకు సహకరిస్తున్న భర్తను నిజామాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ ప్రాంతానికి చెందిన మంగేష్కర్ గైక్వాడ్, ఉజ్వల భార్యభర్తలు. కాస్మోటిక్ బిజినెస్ చేస్తూ నిజామాబాద్లోని మాధవ్నగర్లో కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఈజీ మనీ సంపాదించడానికి సిద్ధమయ్యారు.
ప్రతి రోజు సాయంత్రం చీకటి పడ్డాక ఉజ్వల సిటీలోని ముఖ్య కూడళ్ల మీదుగా ఒంటరిగా బైక్లపై వెళ్తున్న పురుషులను అసభ్య సైగలతో అట్రాక్ట్ చేసి, వారి బైక్పై కూర్చొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేది. రేప్ కేస్ పెట్టిస్తానని బెదరగొట్టేది. అప్పటికే వారిని అనుసరిస్తూ అక్కడికి చేరుకున్న భర్తతో కలిసి నిలువు దోపిడీ చేసేవారు. ఈ గలీజ్ దందాను వృత్తిగా మార్చుకున్న దంపతులపై నిఘా పెట్టి శనివారం రాత్రి పట్టుకున్నామని సీఐ తెలిపారు.
