రైలు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల దుర్మరణం

రైలు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల దుర్మరణం

నిజామాబాద్, వెలుగు : కదులుతున్న ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో కూతురితో పాటు ఆమె తండ్రి కూడా చనిపోయాడు. నిజామాబాద్​ రైల్వే స్టేషన్​లో  శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రైన్​ ఎక్కే ప్రయత్నం చేసిన జనని (14) ప్లాట్​ఫాం మధ్య ఇరుక్కోగా ఆమెను కాపాడేందుకు తండ్రి రాంచందర్​రావు (40) ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రాణాలు విడిచారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్​కు చెందిన రాంచందర్​రావు తన కూతురు జననితో కలిసి పర్భనీ ఎక్స్​ప్రెస్​లో బేగంపేట నుంచి బాసరకు ప్రయాణమయ్యారు.

వారి వెంట  కుటుంబ సభ్యులు కూడా ప్రయాణిస్తున్నారు. నిజామాబాద్​ స్టేషన్ లో వాటర్​ బాటిల్​ కొనడానికి జనని కిందకు దిగింది. కొద్ది సేపయ్యాక రైలు కదిలింది. దీంతో కంగారుపడిన జనని.. ఒక చేతిలో బాటిల్​ పట్టుకొని కదులుతున్న ట్రైన్​ ఎక్కే ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె కాలుజారి ప్లాట్​ఫాం మధ్య ఇరుక్కొని తీవ్రంగా గాయపడింది. గమనించిన ఆమె తండ్రి జననిని కాపాడే యత్నంలో ఆయన కూడా ప్లాట్ ఫాం మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ రైల్వే పోలీసులు జీజీహెచ్​ హాస్పిటల్​ తరలించగా అప్పటికే మృతి చెందారని డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేశామని రైల్వే ఎస్సై తావునాయక్​ తెలిపారు.