ఎంసెట్​ కోచింగ్​ అర్థం కావడం లేదని.. గోదావరిలో దూకి విద్యార్థి ఆత్మహత్య

ఎంసెట్​ కోచింగ్​ అర్థం కావడం లేదని.. గోదావరిలో దూకి విద్యార్థి ఆత్మహత్య

నవీపేట్, వెలుగు : నిజామాబాద్ ​జిల్లాలో ఎంసెట్​ కోచింగ్​ అర్థం కావడం లేదంటూ ఓ విద్యార్థి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ యాదగిరి గౌడ్, గ్రామస్తుల కథనం ప్రకారం..నవీపేట్​ మండలం నాగేపూర్​కు చెందిన పులి సూర్య (16) నిజామాబాద్​లోని ఓ కాలేజీలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. అక్కడే ఎంసెట్ ​కోచింగ్ ​కూడా తీసుకుంటున్నాడు. తనకు క్లాసులు అర్థం కావడం లేదని కొద్దిరోజుల నుంచి తల్లిదండ్రులకు చెప్తున్నాడు. వారు ఇప్పటికే ఫీజు కట్టామని, ఎలాగో కోచింగ్​తీసుకుని ఎగ్జామ్​ రాయమని, వస్తే వస్తుంది లేకపోతే లేదని సర్ది చెప్పారు. సోమవారం సూర్య తండ్రి శ్రీనివాస్​ బర్త్​డే ఉండడంతో ఆదివారం రాత్రి కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు. 

అప్పుడు కూడా తనకు కోచింగ్​ ఇష్టం లేదని చెప్పాడు. ‘మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలేనేమోనని భయంగా ఉంది డాడ్​..మీ గోల్​నేను చేరుకోలేను’ అని బాధపడ్డాడు. దీంతో తల్లిదండ్రులు సూర్యకు నచ్చజెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో సూర్య తండ్రి బర్త్​డే సెలబ్రేషన్స్ ​నిర్వహించారు. తర్వాత కాలేజీకి వెళ్లాలని పేరెంట్స్ కోరడంతో ​తట్టుకోలేకపోయాడు. కోపంతో తల్లిని బైక్​ తాళాలు అడిగి తీసుకుని వెళ్లిపోయాడు. ఫ్రెండ్స్​దగ్గరకు వెళ్తున్నాడేమో అనుకుని ఏమీ మాట్లాడలేదు. 

కొద్దిసేపటికి అతడి స్నేహితులకు ఫోన్​ చేయగా ఎవరూ తమ దగ్గరకు రాలేదని చెప్పారు. అనుమానంతో సూర్య తండ్రి గోదావరి దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ బైక్ ​కనిపించింది. చేపలు పట్టే మత్స్యకారులను అడగ్గా ఎవరో బ్రిడ్జిపై నుంచి దూకినట్టు అనిపించిందని చెప్పారు. గోదావరిలో గాలించగా డెడ్​బాడీ దొరికింది. సూర్య తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.