సుల్తానాబాద్ చైర్ పర్సన్​పై అవిశ్వాస తీర్మానం

సుల్తానాబాద్ చైర్ పర్సన్​పై అవిశ్వాస తీర్మానం

పెద్దపల్లి/ సుల్తానాబాద్, వెలుగు: బీఆర్ఎస్ కు చెందిన సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీతపై మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. సోమవారం 11 మంది కౌన్సిలర్లు కలెక్టర్ సంగీతకు నోటీసు అందజేశారు. ఫిబ్రవరి 8 నుంచి పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు ముత్యం సునీతకు వ్యతిరేకంగా అవిశ్వాసంపై రాజకీయాలు ప్రారంభించారు. ఈ క్రమంలో మేడారం సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో సునీతను దించాల్సిందేనంటూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని కలిసి తమ అభిప్రాయం చెప్పారు. చైర్ పర్సన్ ను రాజీనామా చేయించాలని, లేదా అవిశ్వాస తీర్మానం పెట్టి దించేస్తామని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో చైర్ పర్సన్ భర్త రమేశ్​గౌడ్ తో ఎమ్మెల్యే సంప్రదింపులు జరిపినా రాజీనామా వ్యవహారంలో స్పష్టత రాలేదని తెలిసింది. దీంతో అధికారికంగా చైర్ పర్సన్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ కౌన్సిలర్లు కలెక్టర్ కు తీర్మానం నోటీస్ ను అందజేశారు. 

నోటీస్​పై కౌన్సిలర్ల సంతకాలు..

మున్సిపల్ సెక్షన్​37 ప్రకారం ప్రత్యేక మున్సిపల్​సమావేశం ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు కలెక్టర్​ను కోరారు. కాగా అవిశ్వాసంపై సంతకాలు చేసిన వారిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత, కౌన్సిలర్లు పసెడ్ల మమత, గాజుల లక్ష్మి, కూకట్ల గోపి, అనుమాల అరుణ, రేవెల్లి తిరుపతి, గాజుల లక్ష్మి, కాంగ్రెస్ కు చెందిన ఎండీ నిషాద్, చింతల సునీత, గొట్టం లక్ష్మి, దున్నపోతుల రాజయ్య ఉన్నారు. కౌన్సిల్​లో మొత్తం 15 మంది ఉండగా, చైర్ పర్సన్ ముత్యం సునీత  కాకుండా14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ కు చెందిన సిద్ధ కనకయ్య అనే కౌన్సిలర్ మరణించగా మరో కాంగ్రెస్ కౌన్సిలర్ వూట్ల వరప్రదీప్ అవిశ్వాసానికి దూరంగా ఉన్నాడు. బీఆర్ఎస్​కు చెందిన మరో కౌన్సిలర్ పారుపెల్లి జ్ఞానేశ్వరి అందుబాటులో లేని కారణంగా నోటీసు ఇచ్చే సమయంలో లేరు. అవిశ్వాసానికి మద్దతు అందజేస్తున్నారని అసమ్మతి శిబిరం పేర్కొంది. అయితే అవిశ్వాస తీర్మానం నోటీసుపై కలెక్టర్​ ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

రేసులో ఇద్దరు..

సుల్తానాబాద్ చైర్ పర్సన్ రేసులో గాజుల లక్ష్మి, పారుపల్లి జ్ఞానేశ్వరి ఉన్నట్లు సమాచారం. చాలాకాలం నుంచి చైర్ పర్సన్ సునీతతో ఉన్న విభేదాల కారణంగానే అవిశ్వాసం పెట్టినట్లు తెలిసింది. అలాగే అవిశ్వాసం పెడితే భవిష్యత్​లో ఎవరు చైర్ పర్సన్ కావాలనే దానిపై ఇప్పటికే కౌన్సిలర్లకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. గాజుల లక్ష్మి, పారుపల్లి జ్ఞానేశ్వరిలో ఎవరైనా తమకు ఆమోదమేనని కౌన్సిలర్లు చెప్పినట్లు సమాచారం.