అసమ్మతి కౌన్సిలర్లే కీలకం..మీటింగ్​కు వస్తారా లేదా అన్న ఉత్కంఠ

అసమ్మతి కౌన్సిలర్లే కీలకం..మీటింగ్​కు వస్తారా లేదా అన్న ఉత్కంఠ
  • మద్దతు కోసం కాంగ్రెస్​ నేతల ప్రయత్నాలు 
  • గైర్హజరయ్యేలా చూడాలని చైర్​పర్సన్ ​ఎత్తులు 
  • రేపు చైర్​పర్సన్​పై అవిశ్వాస పరీక్ష

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మున్సిపల్​ చైర్​పర్సన్​పై అవిశ్వాస వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది. బీఆర్ఎస్​ అసమ్మతి కౌన్సిలర్ల నిర్ణయం మీదే చైర్​పర్సన్ భవితవ్యం ఆధారపడిఉంది. అవిశ్వాసం మీద ఓటింగ్​ కోసం కలెక్టర్​ ఈనెల 30న సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్​ పార్టీకి 27 మంది కౌన్సిలర్ల బలముంది. అవిశ్వాసం మీద ఓటింగ్​ కోసం మీటింగ్​ నిర్వహించాలంటే 34 మంది కౌన్సిలర్లు హాజరుకావాల్సిఉంటుంది. కోరం పూర్తి కావాలంటే మరో ఏడుగురు హాజరుకావాలి. దీంతో కాంగ్రెస్​ నేతలు బీఆర్ఎస్​ అసమ్మతి కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

క్యాంపులో ఉన్న బీఆర్ఎస్​ అసమ్మతి కౌన్సిలర్లతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు చెప్తున్నారు. ​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మున్సిపల్​ వైన్​ చైర్​పర్సన్​తోపాటు పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరారు. ప్రస్తుతం బీఆర్​ఎస్​లో 16 మంది మిగిలారు. ఇందులో 9 మంది చైర్​ పర్సన్​ నిట్టు జాహ్నవి పట్ల అసంతృప్తితో ఉన్నారు. వారు వారం రోజులుగా క్యాంపులో ఉన్నారు. అసమ్మతివాదులు పరోక్షంగా కాంగ్రెస్​కు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసం మీటింగ్​కు గైర్హాజరయ్యేలా చూడాలని చైర్​పర్సన్​ వర్గం ప్రయత్నాలు చేస్తోంది.

జాహ్నవి తండ్రి, బీఆర్​ఎస్​ సీనియర్ ​లీడర్​ నిట్టు వేణుగోపాల్​రావు కేటీఆర్​ను కలిసి  పరిస్థితి వివరించారు. దీంతో 9 మంది కౌన్సిలర్లను వెనక్కి రప్పించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా ప్రెసిడెంట్​ ముజీబొద్ధిన్​కు కేటీఆర్​సూచించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్​కు చెందిన కౌన్సిలర్లు హాజరుకాకపోతే కోరం లేక మీటింగ్ వాయిదా పడి.. అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంది. 

హైకోర్టుకు చైర్​పర్సన్? ​ 

అవిశ్వాస పరీక్షపై స్టే కోరుతూ చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవి హైకోర్టులో పిటిషన్​ వేసినట్లు తెలుస్తోంది. 

 హైదరాబాద్​కు చేరిన కాంగ్రెస్ ​కౌన్సిలర్లు

గోవా క్యాంపులో ఉన్న 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం వరకు హైదరాబాద్​లోనే మకాం వేసి.. మీటింగ్​ టైంకు నేరుగా మున్సిపల్​ ఆఫీసుకు రానున్నారు. గోవాలోనే క్యాంపులో ఉన్న బీఆర్​ఎస్ కౌన్సిలర్లు కూడా గురువారం హైదరాబాద్​కు చేరుకోనున్నారు.