నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం

నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం

రాష్ట్రంలో అవిశ్వాస తీర్మానాల ట్రెండ్ కొనసాగుతోంది. మున్సిపల్ చైర్మన్లు, చైర్ పర్సన్లపై కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురువేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ పై మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు 8 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. 

ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, అందోల్- జోగిపేట మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. దీంతో పాటు.. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెేల్ – ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి గుప్తాపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. 20 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 14 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌కు నోటీసును అందజేశారు. 

ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు..రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు కాకరేపుతున్నాయి.  ఎల్లారెడ్డి, వనపర్తి, ఆర్మూర్,జనగామ, నంది కొండ, యాదగిరి గుట్ట, చండూరు, జగిత్యాల,భువనగిరి,ఇల్లందు, మేడ్చల్ మున్సిపాలిటీల్లో  చైర్మన్లు , కౌన్సిలర్లకు పొసగడం లేదు. దీంతో కౌన్సిలర్లు మాకు ఈ చైర్మన్ వద్దంటూ అవిశ్వాస తీర్మానాలను పెడుతున్నారు. 

మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల అంశం బీఆర్ఎస్ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇన్నాళ్లు పరస్పరం సహకరించుకున్న చైర్మన్, కౌన్సిలర్ల మధ్య ఎందుకు వివాదం రేగింది. వరుసగా మున్సిపల్ అవిశ్వాస తీర్మానాలు ఎందుకు జరుగుతున్నాయన్న అంశంపై అధిష్టానం ఆరా తీస్తోంది. అయితే అధినాయకత్వం కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందా..? అన్న సందేహం కలుగుతోంది.