PSL 2026 in Crisis: పాకిస్థాన్ సూపర్ లీగ్ 11వ సీజన్పై ఇరాన్ వర్సెస్ అమెరికా– -ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పడింది. మార్చి 26వ తేదీన లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో లాహోర్ ఖలందర్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్మెన్ మధ్య జరగాల్సిన మ్యాచ్తో ఈ టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంధన సంక్షోభంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా, ఈ సీజన్ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు.. మ్యాచ్లన్నీ 'క్లోజ్డ్ డోర్స్' (జనం లేకుండా) మధ్య జరుగుతాయని ప్రకటించింది.
గతంలో ఆరు నగరాల్లో నిర్వహించాలని ఈ టోర్నమెంట్ జరపాలని ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు కేవలం లాహోర్, కరాచీలలో మాత్రమే మొత్తం ఈవెంట్ జరగనుంది. పెషావర్, ముల్తాన్, రావల్పిండి, ఫైసలాబాద్ వేదికలను రద్దు చేసింది. అలాగే లాహోర్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ ని ఘనంగా నిర్వహించాల్సిన ఓపెనింగ్ సెర్మనీని కూడా బోర్డు రద్దు చేసింది. ఈ సందర్భంగా పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ఇరాన్– ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా తలెత్తిన తీవ్రమైన ఇంధన సంక్షోభమే దీనికి ప్రధాన కారణం అని పేర్కొన్నారు. ఇప్పటికే మేము పాఠశాలలను మూసివేశాం, వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేశాం.. ఈద్ సెలవుల సంఖ్యను పెంచాం.. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో మాకు తెలియదు.. ఈ పరిస్థితిని పరిశీలించి, భద్రతా ఏజెన్సీలతో చర్చించిన తర్వాత, PSL ను అసలు షెడ్యూల్ ప్రకారం కొనసాగించడానికి నిర్ణయించామని నఖ్వీ చెప్పారు.
►ALSO READ | SRH Practice Match: ప్రాక్టీస్ మ్యాచ్లోనే 282 రన్స్.. మరోసారి దుమ్మురేపేందుకు సిద్ధమైన ఎస్ఆర్హెచ్
మరోవైపు ఆప్ఘనిస్థాన్– పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో పీఎస్ఎల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పలువురు విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ నుంచి తప్పుకుని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ఆయా జట్ల తరపున ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ ఆటగాళ్లను పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించడం కూడా పీఎస్ఎల్ లీగ్పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
