- బకాయిలు కూడా వచ్చే ఏడాది జులై వరకు ఇచ్చేది లేదు
- స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: లాక్డౌన్ వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ను పెంచబోమని ప్రకటించింది. జనవరి 1 నుంచి ఉన్న పెండింగ్ మొత్తాన్ని కూడా చెల్లించేది లేదని గురువారం వెల్లడించింది. దీంతో వచ్చే ఏడాది జులై వరకు డీఏలో పెంపు ఉండదు. పెన్షనర్లకు కూడా జనవరి 1 నుంచి డీఏను నిలిపేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది జులై వరకు బకాయిలు కూడా చెల్లించేంది లేదని, ఇప్పుడు ఉన్న రేట్ కొనసాగుతుందని అడిషనల్ సెక్రటరీ అన్నీ జార్జ్ మాథ్యూ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఉద్యోగుల డీఏను 17 నుంచి 21 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ గత నెలలో నిర్ణయించింది. దానికి సంబంధించి ఆ తర్వాత ఎలాంటి అధికారిక ప్రకటన, ఉత్తర్వులు లేవు. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో డీఏ పెంచకూడదని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించారు.