మైక్రో బ్రూవరీలకు లక్కీ డ్రా నిబంధన పెట్టలేదు : కమి షనర్ హరికిరణ్

మైక్రో బ్రూవరీలకు లక్కీ డ్రా నిబంధన పెట్టలేదు : కమి షనర్ హరికిరణ్
  •     ఎక్సైజ్  కమిషనర్  వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మైక్రో బ్రూవరీస్  లైసెన్స్‌‌‌‌‌‌‌‌ల మంజూరు విషయంలో నియమ నిబంధనలకు అనుగుణంగానే వెళ్తున్నామని ఎక్సైజ్​ శాఖ కమిషనర్​ హరికిరణ్​ తెలిపారు. లక్కీ డ్రా తీసి మైక్రో బ్రూవరీస్​ కేటాయింపులు చేయాలని నిబంధన పెట్టనందునే ఆ ప్రక్రియ అమలు చేయడం లేదన్నారు.  2025 సెప్టెంబరులో మైక్రోబ్రూవరీల స్థాపన కోసం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు తీసుకున్నామని చెప్పారు. 

మైక్రో బ్రూవరీలకు టీసీయూఆర్  పరిధిలో 99 దరఖాస్తులు, ఇతర మున్సిపల్  కార్పొరేషన్ల నుంచి 7 అప్లికేషన్లు, మొత్తం 106 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో హైదరాబాద్  డీసీ పరిధిలో 33 దరఖాస్తులు, రంగారెడ్డి డీసీ పరిధిలో 64, కరీంనగర్, మెదక్  డీసీ పరిధిలో రెండేసి, ఖమ్మం డీసీ పరిధిలో 3, వరంగల్, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్  డీసీల పరిధిలో  ఒక్కో అప్లికేషన్  వచ్చిందని వివరించారు.  వీటి పరిశీలన నిమిత్తం సంబంధిత డీసీలకు పంపించామని తెలిపారు.

ఆబ్కారీ ఉద్యోగులకు వడ్డీ ‘ఊరట’

ఆబ్కారీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి తమ శాఖ పెద్దపీట వేస్తుందని ప్రొహిబిషన్  అండ్  ఎక్సైజ్  కమిషనర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు. మంగళవారం ఆబ్కారీ భవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ‘ఆరోగ్య సహయత’ జనరల్  బాడీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  గతంలో ఉన్న 12 శాతం వడ్డీని 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని హరికిరణ్  వెల్లడించారు. 

ఈ 2 శాతం తగ్గింపుతో ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యవసర చికిత్సల కోసం నగదు అందించడం, అవసరమైన వారికి రుణ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ పథకం.. ఆబ్కారీ సిబ్బందికి కొండంత అండగా నిలుస్తున్నదని  కొనియాడారు.