- ప్రకటించిన ఫైనాన్స్ మినిస్టర్
- పీఎంజీకే, ఆత్మనిర్భర భారత్ అభియాన్లు మాత్రమే నడుస్తయ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది కొత్త స్కీంలు ఏవీ ప్రారంభించేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖర్చు కూడా పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త స్కీంలు ప్రారంభించాలని రిక్వెస్ట్లు పంపొద్దని అన్ని మంత్రిత్వ శాఖలకు చెప్పామని అన్నారు. కేవలం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ ప్యాకేజ్, ఆత్మనిర్భర భారత్ ప్యాకేజ్ కోసం మాత్రమే నిధులు ఖర్చు చేస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరే కొత్త స్కీంలను ప్రవేశపెట్టము అని సీతారామన్ అన్నారు. “ కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజా ఆర్థిక వనరులపై చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అభివృద్ధి చెందుతున్న, మారుతున్న ప్రాధాన్యాలకు అనుగుణంగా వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉంది” అని సీతారామన్ అన్నారు. బడ్జెట్కింద ఆమోదించిన స్కీంలను కూడా మార్చి 31 వరకు నిలిపేయనున్నారు. ఈ రూల్స్కు సంబంధించి ఎలాంటి మినహాయింపులను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్డిచర్ ఆమోదించకూడదు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఇబ్బందుల్లో పడ్డ వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో రూ.20.97లక్షల కోట్ల ఎకనామిక్ ప్యాకేజ్ ప్రకటించింది.
