‘మహా’ కూటమిలో సీఏఏ మంటలు

‘మహా’ కూటమిలో సీఏఏ మంటలు

ముంబై/న్యూఢిల్లీమహారాష్ర్టలో ఏర్పాటైన అఘాడీ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి. సీఏఏ, ఎన్పీఆర్ విషయంలో శివసేన, ఎన్సీపీ మధ్య విభేదాలు బయటికొచ్చాయి. సీఏఏకు మహారాష్ర్ట సీఎం ఉద్ధవ్ థాక్రే జై అంటే.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నై అంటున్నారు. మద్దతిస్తామని ఉద్ధవ్ అంటే.. వ్యతిరేకిస్తామని పవార్ అన్నారు. దీంతో కొన్నినెలలుగా సైలెంట్ మోడ్​లో ఉన్న మహారాష్ర్ట రాజకీయాలు మరోసారి వేడి పుట్టించాయి.

అసలేమైందంటే…

మహారాష్ర్టలో కొన్ని నెలల కిందట కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి ‘మహావికాస్ అఘాడీ’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సిటిజన్​షిప్ అమెండ్​మెంట్ యాక్ట్(సీఏఏ), నేషనల్ పాపులర్ రిజిస్టర్ (ఎన్పీఆర్)పై శివసేన తమ వైఖరి తెలిపింది. ఆ రెండింటికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. సింధుదుర్గ్​లో మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్ థాక్రే.. సీఏఏతో ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు. తమ రాష్ర్టంలో ఎన్పీఆర్ అమలును అడ్డుకోబోమని తెలిపారు. శివసేన, కాంగ్రెస్‌‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్ మాత్రం భిన్నంగా స్పందించారు. సీఏఏను వ్యతిరేకిస్తామని గతంలో చెప్పామని స్పష్టం చేశారు. అయితే దీనిపై శివసేనతో చర్చిస్తామని, ఆ పార్టీని కన్విన్స్ చేస్తామని అన్నారు.

భీమా-కోరెగావ్​కేసును కేంద్రానికి ఇవ్వం

భీమా–కోరెగావ్ కేసు దర్యాప్తును కేంద్రానికి అప్పగించబోమని ఉద్ధవ్ వెల్లడించారు. ఎల్గర్ పరిషద్ కేసు దర్యాప్తును ఈ మధ్య ఎన్ఐఏకి మహా ప్రభుత్వం అప్పగించింది. దీనిపై శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్పందించిన ఉద్ధవ్.. ‘‘ఎల్గర్, భీమా–కోరెగావ్ కేసులు రెండూ వేర్వేరు. భీమా–కోరెగావ్ దర్యాప్తును కేంద్రానికి అప్పగించబోం. దళిత సోదరులకు అన్యాయం జరగనివ్వం”అని చెప్పారు.