
47 రోజులుగా కాశ్మీర్లో ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ పనిచేయడం లేదు. అయినా ఎప్పటిమాదిరిగానే టెలికాం కంపెనీలు బిల్లులు మాత్రం పంపాయి. వాడుకోని సర్వీస్లకు మేమెందుకు బిల్లు కట్టాలని కాశ్మీర్ ప్రజలు ప్రశ్నిస్తున్నా.. కంపెనీలు మాత్రం బిల్లు పే చేయకుంటే కనెక్షన్ కట్ చేస్తామంటున్నాయి. కేంద్రం జమ్మూ, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన ఆగస్టు 5వ తేదీ నుంచి స్థానికంగా ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సర్వీసులు ప్రారంభం కాలేదు. ‘ఆగస్టు 5 నుంచి సిగ్నల్స్ లేక ఫోనే పనిచేయడం లేదు. ఎయిర్టెల్ వాళ్లు 779 రూపాయల బిల్లు పంపారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడని ఫోన్కు బిల్లు కట్టడం ఏంటి?’ అని ప్రశించారు సఫాకదల్కు చెందిన ఓబైద్ నబీ. ‘నేను బీఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్ వాడుతున్నా. యావరేజ్గా ప్రతి నెలా 380 రూపాయల బిల్లు వచ్చేది. నెలన్నర నుంచి ఫోనే వాడట్లేదు. అయినా ఈ నెల 470 రూపాయల బిల్లు వచ్చింది.’ అని మహమ్మద్ ఉమర్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.