
న్యూఢిల్లీ: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన ఏదీ లేదని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బీజేపీ సీనియర్ లీడర్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఫిషరీస్, యానిమల్ హాస్బెండరీ, డైరీ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బాఘెల్ రాత పూర్వక సమాధానం ఇచ్చారు.
‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 246(3) ప్రకారం, కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన అధికారాల పంపిణీ ప్రకారం.. జంతువుల సంరక్షణపై రాష్ట్ర శాసనసభకు చట్టాన్ని రూపొందించే ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆవుల రక్షణ, పెంపకం కోసం చేపట్టిన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబర్ నుంచి రాష్ట్రీయ గోకుల్ మిషన్ను అమలు చేస్తోంది”అని చెప్పారు.