న్యూఢిల్లీ: జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో చేసిన రేప్ కామెంట్స్పై వెనక్కి తగ్గేదిలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ చెప్పారు. దీనిపై అధికార బీజేపీ చేసిన ఆరోపణల్ని పట్టించుకోబోనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇష్యూపై ‘సారీ’ చెప్పబోనని మొండికేశారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీని ‘రేప్ కేపిటల్’ అన్నందుకు ప్రధాని నరేంద్రమోడీ ఇప్పడు క్షమాపణ చెప్పాలని రాహుల్ శుక్రవారం డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు అపాలజీ చెప్పే ప్రశ్నేలేదని ఆయన పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. “మోడీ ఎప్పుడూ ‘ మేడ్ ఇన్ ఇండియా’ గురించి మాట్లాడుతుంటారు. దేశమంతటా ఇప్పుడు అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటూ న్యూస్పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగానే ‘ రేప్ ఇన్ ఇండియా’ అని కామెంట్ చేయాల్సి వచ్చింది’ అని రాహుల్ వివరణ ఇచ్చారు. “బీజేపీ , ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఈశాన్య రాష్ట్రాలకు నిప్పు పెట్టారు. ఈ ఇష్యూ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే తెలివిగా బీజేపీ నేను చేసిన కామెంట్స్ను హైలైట్ చేస్తుంది” అని ఆయన వివరించారు. ఢిల్లీని రేప్ కాపిటల్ అంటూ మోడీ చేసిన కామెంట్స్కు సంబంధించిన వీడియో క్లిప్ లు తన ఫోన్లో ఉన్నాయని రాహుల్ చెప్పారు.
‘‘మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినందుకు, యువతకు రావాల్సిన ఉద్యోగాలను లాక్కున్నందుకు కూడా నరేంద్రమోడీ సమాధానం చెప్పాలి”అని రాహుల్ డిమాండ్ చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చేసిన కామెంట్స్ను రాహుల్ వివరించారు. “బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉన్నావ్(యూపీ)లో బీజేపీ ఎమ్మెల్యే అమ్మాయిపై అత్యాచారం చేశారు. బాధితురాలు వెళ్తున్న వెహికిల్ కు యాక్సిడెంట్చేయించారు. దీనికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఒక్కమాట మాట్లాడరు. నిందితులపై ఎలాంటి యాక్షన్ తీసుకోరు”అని రాహుల్ ఆరోపించారు.

