హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం కింద కూలీలకు తగినన్ని పనిదినాలు కల్పించడం లేదంటూ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ (ఏపీఓ), టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)ల జీతాల్లో కోత వంటి ప్రభుత్వ నిర్ణయాలు కలకలం రేపుతున్నాయి. గత ఏడాది కాలంలో యాక్టివ్ జాబ్ కార్డులకు సగటున10 పని దినాలు కూడా కల్పించని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని, 39 రోజుల కంటే తక్కువ పనిదినాలు మాత్రమే కల్పించినవారి జీతం రూ.5 వేలకు తగ్గించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. తాజాగా డిమాండ్ మేరకు కూలి కల్పించని ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్ల వేతనాల్లోనూ కోత విధించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు సర్క్యులర్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జనవరి1 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. దీంతో అటు ఫీల్డ్ అసిస్టెంట్లకు తోడు ఇటు ఏపీఓ, టీఏల్లోనూ టెన్షన్ మొదలైంది.
వారానికోసారి పర్సంటేజీ..
గ్రామాల్లో పని అడిగిన శ్రమశక్తి సంఘాల కూలీలకు తప్పనిసరిగా పని కల్పించేలా ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వారానికి ఒకసారి ఆయా క్లస్టర్ల పరిధిలోని వర్క్ డిమాండ్, చేసిన పనిదినాలను బట్టే ఈ పర్సంటేజీని తీయాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోలేని ఏపీఓల వేతనంలో వారానికి రూ.345, టెక్నికల్ అసిస్టెంట్ల వేతనంలో వారానికి రూ.200 కట్ చేయనున్నారు. నెలలో వచ్చే నాలుగు లేదా ఐదు వారాల్లో కలిపి కోత విధించే మొత్తం వారి బేసిక్ శాలరీలో 8 శాతం మించొద్దని పేర్కొన్నారు. ఈ లెక్కన నెల మొత్తం టార్గెట్ను చేరుకోలేని ఏపీఓలకు రూ.1,400 వరకు, టీఏలకు రూ.800 వరకు జీతంలో కోత పడే అవకాశముంది. అలాగే పని అడిగిన ప్రతి శ్రమశక్తి సంఘానికి ఫీల్డ్ అసిస్టెంట్లు నిబంధనల మేరకు100 శాతం పని కల్పించాల్సి ఉంటుంది. వీరికి కూడా వారానికి ఒకసారి ఆ గ్రామంలోని వర్క్ డిమాండ్, చేసిన పనిదినాలను బట్టి పర్సంటేజీని తీస్తారు. ఆ వారంలో పని అడిగిన ఒక్క గ్రూప్ కు ఉపాధి కల్పించకపోయినా ఫీల్డ్ అసిస్టెంట్ల జీతంలో ఆ వారానికి రూ.556 కట్ అవుతుంది. అయితే నెలలో అన్ని వారాలకు కలిపి ఈ కటింగ్స్ బేసిక్ శాలరీలో 25 శాతానికి మించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల జీతం 5 వేలకు తగ్గిపు
గతంలో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉన్న ఈజీఎస్ ఫీల్డ్ అసిసిస్టెంట్ల జీతాన్ని ప్రభుత్వం రకరకాల కారణాలు చూపుతూ తగ్గించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాక్టివ్ జాబ్ కార్డులకు సగటున10 పని దినాలు కల్పించని1,900 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల కాంట్రాక్ట్ను రెన్యూవల్ చేయకుండా కొత్తవారిని తీసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల సిద్ధమైంది. అంతేగాక సగటున10 నుంచి 39 పని దినాలు మాత్రమే కల్పించిన సమారు 3,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలను రూ.10 వేల నుంచి రూ.5 వేలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించినవారి స్థానంలో కొత్తగా తీసుకోబోయే సీనియర్ మేట్స్కు కూడా ఎలాంటి కాంట్రాక్ట్ ఆర్డర్గానీ, అధికారిక ఉత్తర్వులుగానీ ఇవ్వొద్దని డీఆర్డీఓలకు ఇప్పటికే ఆర్డీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వారికి కూడా రూ.5 వేలు మాత్రమే వేతనంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ తీరు కారణంగా ఇటు ఉద్యోగ భద్రత లేక, అటు జీతం సరిపోక దినదినగండంగా పని చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.