
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోదావరి – బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా నిర్ణయం ఉంటుందని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తనకు భరోసా ఇచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ లింక్ ప్రాజెక్టుపై మంత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
అన్ని భాగస్వామ్యపక్షాలతో చర్చించిన తర్వాత పారదర్శకమైన పద్ధతిలోనే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం ఉంటుందని సంబంధిత శాఖ మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రాజెక్టులను ముందుకు సాగనివ్వడం లేదని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రాజెక్టులపై బుధవారం పలువురు కేంద్ర మంత్రులతో కిషన్రెడ్డి సమావేశమయ్యారు. మెట్రో ఫేజ్– 2 ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చర్చంచారు.
మెట్రో ఫేజ్-2 డీపీఆర్ అందింది
తొలుత శ్రమ్ శక్తి భవన్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారంపై డిస్కస్ చేశారు. భేటీ అనంతరం కిషన్ రెడ్డి ఆఫీస్ ఈ భేటీలపై ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
మెట్రో ఫేజ్–-2 కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించిన డీపీఆర్ ఇటీవలే అందిందని ఖట్టర్ తెలిపినట్లు వెల్లడించింది. ఈ డీపీఆర్ను మంత్రిత్వశాఖ అధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొన్నది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్లో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని కొత్త రిపోర్ట్ రూపొందించి ఉంటారని కేంద్ర మంత్రి ఖట్టర్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిపింది.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని ఖట్టర్ పేర్కొన్నట్లు చెప్పింది. అనంతరం అదే భవన్ లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిసిన కిషన్రెడ్డి.. ఏపీ నిర్మించ తలపెట్టిన -బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై చర్చించినట్లు తెలిపింది.