
హైదరాబాద్, వెలుగు: డ్రగ్ మాఫియాను అరికట్టేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి మూకుమ్మడి దాడికి సిద్ధం అవుతున్నారు. టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) ఆధ్వర్యంలో గురువారం కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, టీజీ ఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఏపీ, గోవా, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర పోలీసు అధికారులతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డీఆర్ఐ, కస్టమ్స్, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్పై సమీక్ష జరిపారు. డ్రగ్ మాఫియా సిండికేట్లను గుర్తించడంతో పాటు డ్రగ్ ట్రాఫికింగ్ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సి వ్యూహాలను రూపొందించడంపై భేటీలో చర్చించారు. సరిహద్దు రాష్ట్రాలతో కలిపి నోడల్ అధికారులతో కూడిన స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేశారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ..తెలంగాణలో మాదకద్రవ్యాలను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సింథటిక్ డ్రగ్స్, గంజాయి సహా ఇతర మత్తు ముఠాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. టీజీ ఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర కేసులు, డ్రగ్స్ ముఠాలపై చర్యలు తీసుకునే అంశాల్లో పరస్పర సమాచారం పంచుకోవాలని సూచించారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించి, ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 64(ఏ) ప్రకారం డీ-అడిక్షన్ సెంటర్కు పంపాలన్నారు. డీఐజీ అభిషేక్ మొహంతి, ఎస్పీ రూపేశ్ తెలంగాణలో డ్రగ్ ట్రాఫికింగ్ పై ప్రస్తుత పరిస్థితిని వివరించారు.