ఎలా వండుకున్నా టేస్టీగా ఉండే మాంసాహార వంటల్లో చికెన్ ఇగురు, ఇంకా యాటకూర.. వీటిని కాస్త టేస్టీగా ఎలా వండినా.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. అందుకే.. మీకోసం ఈ వెరైటీలు తెచ్చినం. ఏందీ.. నోట్లో నీళ్లూరుతున్నాయా? ఇంకా లేటెందుకు వంట మొదలుపెట్టేయండి.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.. లొట్టలేసుకుంటూ లాగించేయండి మరి!
చికెన్ ఇగురు తయారీకి కావాల్సినవి
- చికెన్: అరకిలో
- ఉల్లిగడ్డలు : 2
- నూనె : 4 స్పూన్లు
- పచ్చికొబ్బరి : ఒక ముక్క
- పచ్చిమిర్చి : నాలుగు
- గసగసాలు: రెండు స్పూన్లు
- ఉప్పు : తగినంత
- కారం : రెండు స్పూన్లు
- పసుపు : చిటికెడు,
- పెరుగు : ఒక కప్పు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ : ఒక స్పూన్
- గరంమసాలా : ఒక స్పూన్
చికెన్ ఇగురు తయారీ విధానం
ముందుగా చికెన్ కడిగి, ఒక గిన్నెలో వేసి అల్లంవెల్లుల్లి, కారం, ఉప్పు, పెరుగు, గరంమసాలా, పసుపు, కాస్త నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టాలి. పొయ్యి మీద కడాయి పెట్టి గసగసాలు వేగించాలి. పచ్చిమిర్చి, కొబ్బరి, గసగసాలు గ్రైండ్ చేయాలి.
కళాయిలో నూనె వేసి ఉల్లిగడ్డ ముక్కలను దోరగా వేగించాలి. అందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి, గసగసాల పేస్టు కలిపి ఐదు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత చికెన్ వేసి బాగా కలిపి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
►ALSO READ | ఆధ్యాత్మికం: మంగళవారం.. శుక్రవారం అప్పు ఇవ్వకూడదు.. తీసుకోకూడదు.. ఎందుకో తెలుసా..!
కాస్త మగ్గాక తర్వాత రెండుగ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి పదినిమిషాలు ఉంచాలి. రుచి చూసి.. కావాలనుకుంటే మరింత కారం, ఉప్పు వేసి ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉంచితే.. నోరూరించే చికెన్ ఇగురు రెడీ.
యాటకూర తయారీకి కావలసినవి
- మటన్: ముప్పావు కేజీ
- పెరుగు : నాలుగు టీస్పూన్లు (కావాలంటే)
- ధనియాల పొడి : రెండు టీ స్పూన్లు
- కారం: రుచికి సరిపడా
- పసుపు:చిటికెడు
- ఉప్పు :తగినంత
- అల్లం:వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు
- లవంగాలు: నాలుగు
- ఇలాచీలు:రెండు
- దాల్చినచెక్క: కొద్దిగా
- గరం మసాలా: అర టీ స్పూన్
- ఉల్లిగడ్డ తరుగు (వేగించి): రెండు టీస్పూన్లు
- కొత్తిమీర తరుగు : పావు కప్పు
- నూనె : సరిపడా
యాటకూర తయారీ విధానం
స్టవ్ పై గిన్నెలోనూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత మటన్ , పెరుగు, ఉప్పు, నీళ్లు, దనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి .
కావాలంటే మసాలాలు (లవంగాలు, దాల్చిన చెక్క ఇలాచీలు) వేసి సన్నని మంటపై అరగంట ఉడికించాలి. తరువాత ఉల్లిగడ్డ తరుగు వేసి, మటన్ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.
కూర దగ్గరికయ్యాక ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి, కూర త్వరగా ఉడకాలంటే కుక్కర్లో వండొచ్చు.. ఇలా తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు.
