వరద గుప్పిట్లో న్యూయార్క్‌.. ఎమర్జెన్సీ విధింపు

వరద గుప్పిట్లో న్యూయార్క్‌.. ఎమర్జెన్సీ విధింపు

భారీగా కురుస్తోన్న వర్షాలు, వరదలతో అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. న్యూయార్క్‌  నగరాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో అక్కడి గవర్నర్‌ క్యాథి హోచుల్‌ న్యూయార్క్‌ నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 

జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలు ఇళ్ళల్లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కుండపోత వర్షాలతో రోడ్లు, సబ్ వేలు జలమయమయ్యాయి. రానన్న 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

శుక్రవారం (సెప్టెంబర్ 29వ తేదీ) రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. సబ్‌వేలు, ఎయిర్‌పోర్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో తాత్కాలికంగా వాటిని మూసివేశారు. పలు రైళ్లు రద్దయ్యాయి. కుండపోతగా కురుస్తోన్న వర్షాలతో వరదల ఉధృతి మరింత పెరిగే అవకాశముందని అక్కడి జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని ప్రజలకు నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

రెండేళ్ల కిందట కూడా సెప్టెంబర్‌ నెలలోనే ముంచెత్తిన వరదలు ఈశాన్య రాష్ట్రాల్ని కోలుకొని విధంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా బ్రూక్లిన్‌, క్వీన్స్‌ రాష్ట్రాల్లో వరదల ధాటికి 13 మంది మృతి చెందారు.