ఒకే రోజు 2 క్షిపణి పరీక్షలు ప్రయోగించిన ఉత్తర కొరియా

ఒకే రోజు 2 క్షిపణి పరీక్షలు ప్రయోగించిన ఉత్తర కొరియా

ఓవైపు యావత్ ప్రపంచం ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా ఉద్ధృతితో తల్లడిల్లుతుంటే, ఉత్తర కొరియా మాత్రం ఆయుధ సన్నద్ధతపై దృష్టి సారించింది.  ఒకే రోజు రెండు క్షిపణి పరీక్షలు నిర్వహించి అగ్రరాజ్యాలకు మరోసారి సవాల్ విసిరింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే దూకుడు పెంచిన ఉత్తర కొరియా ..కొన్నిరోజుల వ్యవధిలో నాలుగోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది.  ఈ ఉదయం ప్రయోగించిన రెండు క్షిపణులు షార్ట్ రేంజ్ క్షిపణులే.

దీనిపై అమెరికా స్పందించింది. ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్షలతో తమకు ఎలాంటి ముప్పు లేదని అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ తెలిపింది. అయితే ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలతో తూర్పు ఆసియా ప్రాంతంలో అలజడి నెలకొంటుందని అభిప్రాయపడింది. జపాన్ కూడా ఉత్తర కొరియా దూకుడుపై స్పందించింది. ఆ రెండు క్షిపణులు తమ ప్రత్యేక ఆర్థిక భూభాగం పరిధి వరకు రాలేదని జపాన్ రక్షణ మంత్రి నొబువు కిషీ తెలిపారు. ఇటీవల కాలంలో అమెరికా, దాని మిత్రదేశం దక్షిణ కొరియా సంయుక్తంగా క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. అందుకు బదులుగానే ఉత్తర కొరియా తాజా చర్యలకు దిగిందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.