ఆర్టీఏ నుంచి ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు రావట్లే
కాంట్రాక్టు రెన్యూవల్ చేయక పోవడంతో ఆగిన ప్రింటింగ్
సర్కారు తీరుతో సఫర్ అవుతున్న పబ్లిక్
హైదరాబాద్, ఆదిలాబాద్, వెలుగు: ఆరు నెలలుగా కొత్త బండ్లు కొన్నోళ్లకు ఆర్సీ, డ్రైవింగ్ నేర్చుకున్నోళ్లకు లైసెన్స్ కార్డులు వస్తలేవు. స్టేట్వైడ్ సుమారు 2లక్షల మంది అవసరమైన ఫీజులు కట్టి, ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా స్మార్ట్కార్డులు ఎప్పుడు ఇస్తరో చెప్తలేరు. కార్డులు ప్రింట్ చేసే ఏజెన్సీకి కాంటాక్ట్ రెన్యూవల్ ను సర్కారు లేట్చేయడం వల్లే కార్డుల ప్రింటింగ్ ఆగిపోయింది. ఇటీవల ఈ కాంట్రాక్టు రెన్యూవల్ అయినా ఇప్పటికీ కార్డులు ఇవ్వట్లేదు. దీంతో వెహికిలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కార్లు, ఇతర వెహికిల్స్ను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లలేకపోతున్నారు.
2 లక్షల దాకా పెండింగ్
స్టేట్వైడ్56 ఆర్టీవో ఆఫీసులు ఉన్నాయి. డెయిలీ ఒక్కో ఆర్టీవో ఆఫీసులో వందలకొద్దీ వెహికిల్స్కు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఆయా ఓనర్లకు ఒకటి, రెండు రోజుల వ్యవధిలో ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) ఇష్యూ చేయాలి. వెహికిల్స్కు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లలో ఈ ఆర్సీ కార్డే కీలకమైంది. ఇక వెహికల్ డ్రైవింగ్కు సంబంధించి లర్నింగ్పూర్తయినవారికి టెస్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు జారీ చేయాలి. గతంలో ఆర్టీఏ ఆఫీసుల్లో టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన ఒకటి, రెండు రోజుల్లోనే కార్డులను ఇష్యూ చేసేవారు. కానీ లాక్డౌన్ కంటే ముందు నుంచే స్టేట్లో కార్డుల కొరత వేధిస్తోంది. కొన్ని రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ తోపాటు, జిల్లాల్లోని ఆర్టీవో ఆఫీసుల పరిధిలో కార్డులు ఇవ్వట్లేదు. స్టేట్వైడ్ సుమారు 2లక్షల దాకా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ స్మార్ట్ కార్డుల జారీ నిలిచిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ల కంటే ఆర్సీ కార్డులే ఎక్కువగా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా కార్డులు ప్రింట్ చేసే కాంట్రాక్టర్ కాంట్రాక్టు ను రెన్యూవల్ చేయడంలో సర్కారు లేట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలు నెలల తరబడి ప్రభుత్వం వద్దే పెండింగ్లో ఉంది. దీంతో కార్డుల ప్రింటింగ్ ఆగిపోయింది. ఇటీవలే ఈ కాంట్రాక్టు రెన్యూవల్ అయినా ఇంకా కార్డులు మాత్రం ఇష్యూ చేయట్లేదు. కార్డులు వచ్చినప్పటికీ ఇంకా ప్రింటింగ్ స్టార్ట్ కాకపోవడమే ఇందుకు కారణమని ఆఫీసర్లు అంటున్నారు.
కేసులు రాస్తున్నరు..
వెహికిల్స్ డిటైల్స్ ఆర్సీ కార్డులోనే ఉంటాయి. అలాంటి కీలకమైన ఆర్సీ కార్డులు రాకపోవడంతో వాహనదారులు తమ బండ్లను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు భయపడుతున్నారు. కొందరు ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు సొంత వాహనాలు ఉన్నా అద్దె బండ్లలో వెళ్తున్నారు. దీంతో లక్షలు పెట్టి వెహికిల్స్ కొన్నప్పటికీ వాటిని వాడలేకపోతున్నామని ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి తనిఖీల్లో పట్టుబడితే ఫైన్లు కట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. స్టేట్లోనూ ట్రాఫిక్ పోలీసుల నుంచి తిప్పలు తప్పడం లేదు. తనిఖీలు జరిగినప్పుడు తమ వద్ద ఉన్న రిసిప్టులు చూపుతున్నా కొందరు నమ్మడం లేదని అంటున్నారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు సమాచారం లేకపోవడంతో కార్డులు లేవంటూ ఫైన్లు రాస్తున్నారని వెహికిలిస్టులు చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలోనూ ఇలాగే జరుగుతోందని అంటున్నారు. ఎం వాలెట్ పద్ధతిలో స్మార్ట్ ఫోన్లలోనే ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు చూసుకునే చాన్స్ ఉన్నా రూరల్ ఏరియాకు చెందిన చాలా మందికి స్మార్ట్ఫోన్లు లేకపోవడం, ఎం వాలెట్ విధానంపై అవగాహన లేకపోవడంతో ప్రాబ్లమ్స్
వస్తున్నాయి.
అన్ని ఫీజులు కట్టి వెయిటింగ్
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీకావాలంటే ముందుగానే రూ.1550 వరకు చెల్లించాలి. ఇందులో లైసెన్స్ స్మార్ట్ కార్డు ప్రింటింగ్ కోసం ఒక్కొక్కరి నుంచి సర్వీస్ చార్జిల పేరిట రూ.250, పోస్టు ద్వారా ఇంటికి చేరవేసేందుకు రూ.35 పోస్టల్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఒక్కో వినియోగదారుడు సగటున రూ.1500 ఫీజు చెల్లించినట్లు భావించినా, 2లక్షల అప్లికేషన్లకు సంబంధించి ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా ఆర్టీఏ అకౌంట్లో పబ్లిక్పైసలు పడ్డాయి. ఇలా ముందుగానే ఫీజుల రూపంలో కోట్లు వసూలు చేసిన రవాణా శాఖ స్మార్ట్కార్డులను జారీ చేయట్లేదు. దీంతో వెహికిలిస్టులు నెలల తరబడి ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రభుత్వం నుంచే కార్డులు వస్తలేవు..
డ్రైవింగ్ లైసెన్స్లను, వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆర్సీలను రూల్స్ ప్రకారం వారి అడ్రస్లకు పోస్టులో పంపించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచే కార్డుల సప్లై నిలిచిపోయింది. ప్రింటింగ్ జరగడం లేదని తెలిసింది. అందువల్లే వాహనదారులకు వాటిని ఇవ్వలేకపోతున్నాం. కార్టుల ప్రింటింగ్మొదలైన వెంటనే ఇష్యూ చేస్తాం. – పుప్పాల శ్రీనివాస్, ట్రాన్స్ పోర్ట్ డిప్యూటీ కమిషనర్, ఆదిలాబాద్ జిల్లా.
నాలుగు నెలలైనా ఆర్సీ ఇయ్యలే..
నేను కొన్న కారును సెప్టెంబర్లో ఆదిలాబాద్ ఆర్టీఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించిన. నంబర్ కూడా ఇచ్చిన్రు. ఆర్సీ కార్డును ఇంటి అడ్రస్కు పంపించేటందుకు రూ.250 కూడా తీసుకున్నరు. కానీ ఇప్పటిదాక ఆర్సీ రాలేదు. బయటకు వెళదామంటే ట్రాఫికోళ్లు పట్టుకుంటరనే భయంతో ఇంట్లనుంచి కారు తీస్తలేను. వారానికోసారి ఆర్టీఓ ఆఫీసుకు పోయి కార్డు వచ్చిందో లేదో కనుక్కుంటున్న. నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా రాలేదని చెబుతున్నరు.– ముస్కు వినోద్, జైజవాన్నగర్, ఆదిలాబాద్