డిఫమేషన్ కేసులో ముంబై కోర్టుకు హాజరు.. బెయిల్ మంజూరు
ముంబై: సంఘ్ పరివార్ దేశంపై ఆక్రమణ చేస్తోందని, గతంలో కంటే పదింతలు ఎక్కువ శక్తితో దానిపై పోరాడుతానని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు. పేదలు, రైతులు, కూలీల తరఫున నిలబడుతూనే, ఆర్ఎస్ఎస్తో ఐడియాలజికల్ వార్ కొనసాగిస్తానని స్పష్టం చేశారు. డిఫమేషన్ కేసులో విచారణ కోసం గురువారం ముంబైలోని మజ్గావ్ మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరయ్యారు. రూ.15వేల సెక్యూరిటీ, షూరిటీ సంతకాలపై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. రాజీనామా వాపస్ తీసుకోవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కోర్టు ఆవరణలోనే ఆందోళనకు దిగారు. ఆ గందరగోళం మధ్యే ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల రాజీనామాల పర్వం గురువారం కూడా కొనసాగింది. కొత్త కమిటీలు ఏర్పాటుచేసేందుకు వీలుగా చాలా రాష్ట్రాల్లో పలువురు ఆఫీస్ బేరర్లు పదవులు వదిలేశారు. రాహుల్ రాజీనామాను పార్టీ శ్రేణులందరూ వ్యతిరేకిస్తున్నా, ప్రియాంక గాంధీ మాత్రం సమర్థించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ వైరలైంది.
రాహుల్ నాట్ గిల్టీ
ఎన్నికల సందర్భంలో ప్రధాని మోడీపై కామెంట్లు చేసి, కోర్టుకు సారీ చెప్పిన రాహుల్ గాంధీ బుధవారం నాటి లేఖలోనూ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. ప్రజల మధ్య విద్వేషాలు, విభేదాలు సృస్టించడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్ష్యమమని రాహుల్ ఆరోపించారు. కాగా, అదే ఆర్ఎస్ఎస్పై గతంలో కామెంట్లు చేసిన కేసులో ఆయన గురువారం ముంబై కోర్టు ముందు హాజరయ్యారు. 2017లో జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యకు గురైన సందర్భంలో.. ‘ఆమె బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే హత్యకు గురయ్యారు’ అని రాహుల్ అన్నారు. దాన్ని తప్పుపడుతూ ముంబైకి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త దృతిమాన్ జోషి పరువునష్టం దావా వేశారు. రాహుల్ నేరాన్ని అంగీకరించడం లేదంటూ(నాట్ గిల్టీ) ఆయన తరఫు న్యాయవాది చెప్పడంతో ట్రయల్ మొదలుపెడుతున్నట్లు జడ్జి ప్రకటించారు. ఇదే కేసులో సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా నేరాన్ని అంగీకరించలేదు. దీంతో ఇద్దరు నేతలకు తలా రూ.15వేల సెక్యూరిటీ, స్థానికవ్యక్తి(కాంగ్రెస్ మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్) షూరిటీ సంతకంపై బెయిల్ లభించింది. రాహుల్, ఏచూరిలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన జడ్జి.. విచారణకు సెప్టెంబర్ 22కు వాయిదావేశారు.
ప్రియాక గాంధీ ట్వీట్ వైరల్
ఏఐసీసీ నుంచి బూత్ కమిటీల దాకా రాహుల్ రాజీనామాను వ్యతిరేకిస్తుండగా, ప్రియాంక గాంధీ మాత్రం అన్నకు మద్దతుగా నిలిచారు. ‘‘అన్న నిర్ణయాన్ని మనస్పూర్తిగా గౌరవిస్తున్నా. ఇలా ధైర్యంగా అడుగేయగల సత్తా కొద్దిమందికే ఉంటుంది’’అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.
ప్రకాశ్ అంబేద్కర్తో కాంగ్రెస్ పొత్తు!
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై అగ్రెసివ్గా పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ సూచించారు. ముంబై ఎయిర్పోర్టులో నేతలతో మాట్లాడారు. ప్రకాశ్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) పార్టీతో ప్రీపోల్ అలయెన్స్కు కాంగ్రెస్ రెడీగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత విజయ్ వడెట్టివర్ ప్రకటించారు. మహారాష్ట్రలో ఇప్పటికే ఎన్సీపీతో కలిసి సాగుతున్న కాంగ్రెస్.. బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక్కగూటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్లో ఎన్నికలు జరిగే అవకాశముంది.
ఆర్ఎస్ఎస్ నకిలీల అడ్డా: కాంగ్రెస్
పదింతలు రెట్టింపు శక్తితో సంఘ్పై పోరు ఉధృతం చేస్తానని ముంబైలో రాహుల్ ప్రకటించిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ‘‘ఆర్ఎస్ఎస్ వర్సెస్ ఇండియా” పేరుతో కొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టింది. అందులో భాగంగా ‘ఆర్ఎస్ఎస్ నకిలీల అడ్డా’ అంటూ ఓ విమర్శనాత్మక వీడియో రిలీజ్ చేసింది. స్వాతంత్ర్యపోరాటంలో పాలుపంచుకోని సంఘ్.. బ్రిటిషర్లకు అనుకూలంగా పనిచేసిందని, గాంధీని చంపిన గాడ్సేకు రివాల్వర్ ఇచ్చింది ఆ సంస్థ నేతలేనని, నాజీ జర్మనీ స్ఫూర్తితో ‘డిజైనర్ ఆర్యన్ బేబీ’ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారని, ఇండియాలో సెర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీని నిలిపేసేలా మోడీని ఒప్పించారని, శత్రువు కుటుంబాల్లోని ఆడపిల్లల్ని రేప్ చేయడాన్ని సావర్కర్ సమర్థించారని కాంగ్రెస్ పార్టీ వీడియోలో ఆరోపించింది. దీనిపై సంఘ్ ఇంకా స్పందించాల్సిఉంది.